ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాబు, జూ ఎన్టీఆర్: ఐక్యంగా ఉండాలని హరికృష్ణ
హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రమారావు 19వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆదివారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నందమూరి హరికృష్ణ మాట్లాడారు. ఎన్టీఆర్ ఆశయాలు అందరికీ స్పూర్తిదాయకమన్నారు. తెలుగు ప్రజలు బాగుండాలన్న ఎన్టీఆర్ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. తెలుగు వారంతా ఐక్యంగా ఉండాలన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం తామంతా కృషి చేస్తామన్నారు.
ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని జూ ఎన్టీఆర్ అన్నారు. తాతగారి ఆశయాలు నెరవేర్చుతామన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచారన్నారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు కుటుంబ సమేతంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ యుగపురుషుడని, ఆయనకు ఆయనే సాటి అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు పునరంకితమవుతామని చెప్పారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్కు వ్యతిరేక శక్తులను ఏకం చేసిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే స్ఫూర్తి అన్నారు. భావి తరాలకు ఎన్టీఆర్ ఆదర్శమన్నారు.
చంద్రబాబుతో పాటు భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, యనమల, తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, మోత్కుపల్లి, కృష్ణయాదవ్ తదితరులు ఉన్నారు. కాగా, రసూల్ పురాలోని ఎన్టీఆర్ విగ్రహానికి బాబు నివాళులు అర్పించి, అనంతరం ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications