బాబుకు జూపల్లి సవాల్: 'బ్రహ్మానందంలా పవన్ వచ్చారు'
పాలమూరు ప్రజాగర్జన సభలో బాబు మాట్లాడుతూ తెలంగాణలో బిసి రామబాణం వదిలామంటున్నారని, ఈ ప్రాంతంలో ఆ పార్టీ విల్లు విరిగిపోయిందని, ఇక బాణం ఎలా ఎక్కుపెడతారన్నారు. తెలంగాణలో దేశం పార్టీ పునాదులు కదిలాయని, అధికారంలోకి వచ్చే అవకాశమే ఉంటే.. బాబుగానీ, లోకేష్గానీ సిఎం అభ్యర్థిగా ముందుకు వచ్చేవారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని సిఎం చేయబోమని తాము చెప్పలేదన్నారు.
ఓట్ల కోసమే బిసి నేత కృష్ణయ్యను వాడుకుంటున్నారని, ఇంటికో ఉద్యోగం ఇవ్వగలవా అని ప్రశ్నించారు. ఇన్ని సంవత్సరాలూ రాష్ట్రాన్ని ఏలింది కాంగ్రెస్, టిడిపిలేనని అయినా తెలంగాణలో కరెంటు సమస్య ఎందుకు వచ్చిందన్నారు. ఎన్నికలొచ్చాక బాబుకు అమరులు గుర్తుకొచ్చారని, ఆయనకు మానవత్వం ఉంటే.. అసెంబ్లీలో సంతాపసూచకంగా మౌనం ఎందుకు పాటించలేదన్నారు. ఒక్క అమరుని కుటుంబాన్నయినా ఎందుకు పరామర్శించలేదన్నారు.
కవిత సెటైర్లు
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సీరియస్ సినిమాల్లో బ్రహ్మానందంలా ఎంటర్టైన్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు యువకులు తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పవన్ వ్యవహారం ఎన్నికలు రాగానే మేకప్.. అయిపోగానే పేకప్ అన్నట్లుగా ఉందన్నారు.
గత ఎన్నికల ముందు పార్టీ పెట్టి కాంగ్రెస్ను తిట్టారని, ఎన్నికలైపోగానే అన్న కాంగ్రెస్లోకి వెళ్లిపోతే, తమ్ముడు సినిమాల్లోకి వెళ్లిపోయారన్నారు. మళ్లీ ఎన్నికలకు 40 రోజుల ముందు పవన్ వచ్చారన్నారు. సీరియస్ సినిమా వస్తున్నప్పుడు మధ్యలో బ్రహ్మానందం వస్తే ఎంత ఎంటర్టైన్మెంటు ఉంటుందో... అలాగే సీరియస్గా పొలిటికల్ డిస్కషన్ జరుగుతున్న ప్పుడు పవన్ కూడా అటువంటి ఎంటర్టైన్మెంటే ఇచ్చారన్నారు.
ఎవరో రాసిన స్క్రిప్టును వెనుకది ముందు, ముందుది వెనుక చదివి రెండు గంటలపాటు ఉచితంగా.. అద్భుతమైన ఎంటర్టైన్మెంటు అందించారన్నారు. బిజెపి, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, కమ్యూనిస్టులు, లోక్సత్తాలతో పొత్తుకు సిద్ధమంటూ మోడీని, గద్దర్ను కలిశారని, అటు లెఫ్టిస్టులా కాకుండా.. ఇటు రైటిస్టులా కాకుండా పవన్ త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నారన్నారు.