ఫోన్ ట్యాపింగ్: 'కెసిఆర్ అడ్డంగా బుక్కయ్యారు, లోకేష్కు జవాబివ్వాలి'
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏ ముఖ్యమంత్రి కూడా పదవిని కోల్పోలేదని తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు ఆదివారం అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెలంగాణ సర్కారు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని ఆరోపించారు.
ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆదివారం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఏ సీఎం ఇప్పటి వరకు పదవిని పోగొట్టుకోలేదన్నారు. కానీ కుట్రపూరితంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారి పైన చట్టం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ పైన ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలని హితవు పలికారు. తమ పార్టీ యువనే నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ పైన ట్విట్టర్లో చాలా స్పష్టంగా చెప్పారని, దానికి బదులివ్వాలని సవాల్ చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తి ఎంత గొప్ప పదవిలో ఉన్నా కొనసాగేందుకు వీల్లేదన్నారు.
టిడిపిని రూపుమాపాలని చూస్తే, మీ ప్రభుత్వమే కూలిపోతుందని హెచ్చరించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పారు. నియంతృత్వ పోకడలు ప్రదర్శించవద్దని కెసిఆర్కు హితవు పలికారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను మీరితే శిక్షకు గురికాక తప్పదన్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని చూసిన కెసిఆర్ ప్రభుత్వం త్వరలో కుప్పకూలిపోవడం ఖాయమన్నారు. ఇన్నాళ్లు ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కెసిఆర్ సర్కారు బుకాయించిందని, ట్యాపింగ్ జరిగినట్లు సర్వీస్ ప్రొవైడర్లే సుప్రీం వద్ద ఒప్పుకున్నారన్నారు. కెసిఆర్ సర్కార్ అడ్డంగా దొరికిపోయిందన్నారు.
ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 పైన కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎందుకు పెదవి విప్పడం లేదో చెప్పాలని జూపూడి ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా నారా లోకేష్ తెలంగాణ సిఎం కెసిఆర్కు చురక వేసిన విషయం తెలిసిందే.