వలవలా ఏడ్చేసిన జూపూడి, అదే బాటలో మరికొందరు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి జూపూడి ప్రభాకర రావు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో తెలిపారు. కాగా, జూపూడి కంటతడి పెట్టారు. పార్టీలో అవమానించారంటూ ఆయన కంటతడి పెట్టారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమదని దళితులు ఓన్ చేసుకున్నారని కానీ, దళితులను పార్టీ ఓన్ చేసుకోలేకపోయిందన్నారు. దళిత ప్రతినిధులకు కనీసం గుర్తింపు ఇవ్వరన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని అభిమానించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చినప్పటికీ దళితులు, గిరిజనుల పట్ల కుట్ర జరుగుతోందన్నారు. వారికి పార్టీలో స్థానం లేదన్నారు.
పార్టీలో తనకు జరిగిన అవమానాలను తలచుకుని ఆయన వలవలా ఏడ్చేశారు. జగన్ బంధువులకు తప్ప వైయస్ను అభిమానించే నిజమైన అభిమానులకు స్థానం లేదన్నారు. వైవీ సుబ్బారెడ్డి కుట్రకు తాను బలయ్యానని, లేకుంటే గత ఎన్నికల్లో 15 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించి ఉండేవాడినని, తనతోపాటు ఒంగోలులో బాలినేని శ్రీనివాస రెడ్డితోపాటు మరో రెండు స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్ధులు గెలిచేవారన్నారు.
జగన్ను కలిసినప్పుడు ఆయన మాట తీరుతో పార్టీ నుంచి తనను వెలివేశారని అర్థమైందన్నారు. జగన్ కుటుంబ సభ్యులు జగన్ అరెస్టును నిరసిస్తూ రాజ్భవన్ వద్ద ధర్నా చేస్తుంటే, ఆ కుటుంబానికి చెందని నేనొక్కడినే వారితో పాటు ధర్నాలో పాల్గొన్నానని వివరించారు.
జగన్ను సీబీఐ ప్రశ్నిస్తున్న సమయంలో ఆయనకు వెన్నుదన్నుగా ఉన్నానని, కానీ ఆ ధర్నాలో పాల్గొన్న ఏడుగురికి న్యాయస్థానం నుంచి నోటీసులు వస్తే, తన నోటీసును తప్ప మిగిలిన ఆరుగురి నోటీసులను వైవీ సుబ్బారెడ్డి తీసుకున్నారని, తాను ఎక్కడుంటానో తెలియదని నోటీసులను తీసుకువచ్చిన కానిస్టేబుల్తో చెప్పారట అన్నారు. ఇది తనకు తెలిసి ఆవేదనకు గురయ్యానని, తాను ప్రత్యేకంగా లాయర్ను పెట్టుకున్నానని చెప్పారు.
జగన్ జైలుకు వెళితే వైయస్పై ఉన్న అభిమానంతో దళిత, గిరిజన వర్గాలకు చెందిన తన లాంటి నేతలు ఎందరో పార్టీని బతికించారని, కానీ ఆ విశ్వాసం జగన్కు లేదన్నారు. పార్టీలో జరుగుతున్న అవమానాలను తట్టుకోలేక మున్ముందు మరికొందరు నేతలు పార్టీని వీడనున్నారని, వారి పేర్లను తాను ఇప్పుడు చెప్పడం భావ్యం కాదన్నారు.