తెలుగులో జస్టిస్ ఎన్వీ రమణ విచారణ - తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు : రిజిస్ట్రీని బ్లాక్ మెయిల్ చేస్తారా..
తిరుమల శ్రీవారి సేవల విషయం పైన దాఖలైన కేసులో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగులో విచారణ నిర్వహించారు. ఆగమశాస్త్రంలో పేర్కొన్న విధంగా టీటీడీలో ఆచార, సంప్రదాయాలు పాటించడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. స్వయంగా వాదనలు వినిపించిన పిటిషనర్ ఏపీకి చెందినవారు కావడంతో జస్టిస్ రమణ కొద్దిసేపు తెలుగులో విచారణ జరిపారు.
తిరుమల శ్రీవారి కైంకర్యాలు, పూజల విషయంలో ఏదైనా తప్పు చేస్తే దేవుడు ఊరుకోడని, అందరినీ శిక్షిస్తాడని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి ఈ పిటీషన్ దాఖలు చేయటంతో నేరుగా సీజేఐ పిటీషనర్ ను తెలుగులో ప్రశ్నలు వేసారు. పిటీషనర పేరు..ఇంటి పేరు..ఊరు గురించి వివరాలు సేకరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవం తప్పుగా జరగబోతోంది... వస్త్రం లేకుండా అభిషేకం జరుగుతున్నదంటూ సీజేఐకి పిటీషనర్ వివరించే ప్రయత్నం చేసారు. దీంతో..సీజేఐ స్పందిస్తూ శ్రీవారికి పూజ ఎలా చేయాలో వాళ్లకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.

తప్పు చేస్తే దేవుడు అందరినీ శిక్షిస్తారు.. దేవుడు ఊరుకోడు అని చెప్పారు. ఇదే కేసులో భాగంగా పిటీషనర్ ను ఉద్దేశించి..''బాలాజీ భక్తులకు సహనం ఉంటుంది. కానీ మీకు లేదు. కేసును జాబితాలో చేర్చకపోతే చనిపోతాను... అదీ ఇదీ అంటూ రిజిస్ట్రీని రోజూ బ్లాక్మెయిల్ చేయడం సరికాదు. ఏంటిది... మేము కూడా వేంకటేశ్వరస్వామి భక్తులమే నంటూ జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. స్పందించిన శ్రీవారి దాదా అత్యవసర విచారణ కోసం అలా చేశానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. దాంతో ఇందులో అత్యవసరం ఏముంది.. పూజలు ఎలా చేయాలి.. ఏ సమయంలో నిర్వహించాలి, ఎంతమందిని అనుమతించాలి అనే విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవాలా అంటూ ప్రశ్నించారు.
Recommended Video
ఈ అంశంపై టీటీడీకి వినతిపత్రాలు సమర్పించానని పిటిషనర్ పేర్కొన్నారు. దాంతో ఆ వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారని టీటీటీ తరఫు న్యాయవాది సత్య సభర్వాల్ను ధర్మాసనం ప్రశ్నించింది. దానికి న్యాయవాది ఏదో చెప్పబోతుండగా జస్టిస్ రమణ జోక్యం చేసుకున్నారు...కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదని పిటిషనర్ అంటున్నారని.. ప్రతీ ఒక్కరికి స్వామివారిపై విశ్వాసం ఉందన్నారు. వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారు చెప్పండంటూ సూచించారు. వివరాలు తెలుసుకొని చెప్పడానికి కొంత సమయం ఇవ్వాలని టీటీడీ న్యాయవాది కోరారు. దీంతో శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు, పూజల నిర్వహణ విషయంలో వచ్చిన ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరాలు సమర్పించాలని టీటీడీని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications