జ్యోతుల నెహ్రూకు 'టిడిపి' షాక్: పార్టీలో అలజడి, రిజైన్కు అతను రెడీ!
తొలి నుంచి టిడిపి విదేయుడిగా ఉన్న గండేపల్లి మండల టిడిపి అధ్యక్షుడు పోతుల మోహన్ రావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం నాడు ప్రకటించడం స్థానికంగా కలకలం రేపింది.
రాజమహేంద్రవరం: తొలి నుంచి టిడిపి విదేయుడిగా ఉన్న గండేపల్లి మండల టిడిపి అధ్యక్షుడు పోతుల మోహన్ రావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం నాడు ప్రకటించడం స్థానికంగా కలకలం రేపింది.
ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్నారు. పార్టీలోకి వచ్చిన జ్యోతుల నెహ్రూ వర్గం... తమకు మర్యాద, ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
పార్టీ మండల అధ్యక్ష పదవితో పాటు వైయస్ ఎంపీపీ, మండలస్థాయి జన్మభూమి కమటీ పదవులకు కూడా రాజీనామా చేశారు. తద్వారా పార్టీ అధిష్టానానికి తన అసంతృప్తిని తెలిపారు. ఆయనకు సంఘీభావంగా పలువురు నేతలు రాజీనామాను ప్రకటించారు.
రాజీనామాను ప్రకటించిన వారంతా జగ్గంపేట టిడిపి నియోజకవర్గ ఇంచార్జీ జ్యోతుల చంటిబాబు వర్గంగా ముద్రపడిన నేతలు. దీంతో ఆయనను పథకం ప్రకారమే పార్టీకి దూరం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
మోహన రావు సహా ఇతర నేతలు రాజీనామాకు సిద్ధపడుతున్నారనే విషయం తెలిసి వారిని బుజ్జగించేందుకు నెహ్రూ రెండు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నెహ్రూ ముఖ్య అనుచరులు దౌత్యం నెరపినా బెడిసి కొట్టిందని చెబుతున్నారు.
ఇప్పుడు రాజీనామాల పైన వెనక్కి తగ్గినా, ఆ తర్వాత మళ్లీ ఉంటాయని వారు భావిస్తున్నారట. మంగళ, బుధవారాల్లో రాజీనామా లేఖలను అందించేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు నెహ్రూకు సొంత నియోజకవర్గంలో షాక్ తగులుతోందని అంటున్నారు.
నెహ్రూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరిన తర్వాత నుంచి జగ్గంపేట నియోజకవర్గంలో లుకలుకలు మరింత కనిపిస్తున్నాయి. అంతకుముందు కాకినాడ ఎంపీ తోట నరసింహం, జ్యోతుల చంటిబాబు వర్గాలు ఉండేవని, ఇప్పుడు జ్యోతుల నెహ్రూ వర్గం కూడా తయారయిందని అంటున్నారు.