మేం రాజీనామాకు సిద్ధం, మీరు సిద్ధమా: ప్రత్యేక హోదాపై జ్యోతుల నెహ్రూ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక హోదా వస్తుందంటే తాము రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని, టిడిపి ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తారా అని ఆయన సవాల్ చేశారు.
ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా శకం ముగిసిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనడం పచ్చి మోసమని ఆయన అన్నారు. శుక్రవారం హైదరాబాదులో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
జైట్లీ వ్యాఖ్యలు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వబోమన్నట్లు ఉన్నాయని నెహ్రూ అన్నారు. ప్రత్యేక హోదాకు, 14వ ఆర్థిక సంఘానికి ముడిపెట్టడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాపై మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడానికి వీలు ఉంటుందని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రాణత్యాగాలు చేసుకుంటున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వైఖరిలో మార్పు రావడం లేదని ఆయన అన్నారు.