రోజా కించపరచలేదు: జ్యోతుల నెహ్రూ, పుష్పరాజ్ మండిపాటు
హైదరాబాద్: తమ పార్టీ చిత్తూరు జిల్లా నగరి శాసనసభ్యురాలు0రోజా దళితులను అవమానించలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ చెప్పారు. రాజకీయ దురుద్ధేశంతోనే టీడీపీ దుప్ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలే రోజాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు వైసీపీ బస్సు యాత్రలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తామని ఆయన శనివారం మీడియాకు తెలిపారు. ధనార్జన కోసమే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని టీడీపీ ప్రభుత్వం చేపడుతుందని జ్యోతుల నెహ్రూ ఆరోపించారు.
దళితులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలు అగ్రకుల అహంకారానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేత పుష్పరాజ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రోజా వ్యాఖ్యలు బాధాకరమని, అసెంబ్లీలో కూడా ఇలాగే వ్యవహరించారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత పద్దతి మార్చుకోవాలని ఆయన సూచించారు. రోజా వ్యాఖ్యలను ఎస్సీ,ఎస్టీ కమిషన్ సుమోటోగా తీసుకోవాలని పుష్పరాజ్ డిమాండ్ చేశారు.