కెసిఆర్కు రెండు మిస్, చిన్నమ్మని మరువొద్దు: సుష్మా
వరంగల్/మెదక్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెంటికి చెడదారని, అటు కేంద్రమంత్రి కాలేరని, ఇటు ముఖ్యమంత్రి కాలేరని భారతీయ జనతా పార్టీ అగ్రనేత సుష్మా స్వరాజ్ శనివారం అన్నారు. వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కేంద్రంలో మోడీ సర్కారుతో తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ చిన్నమ్మ మాటలను తెలంగాణ ప్రజలు మర్చిపోవద్దన్నారు.
కెసిఆర్ బతుకు రెంటికీచెడ్డ రేవడిగా అటు ఎంపీగా, ఇటు ఎమ్మెల్యేగానూ గెలవకుండా రెండు బస్సులు మిస్ అవుతారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ మెదక్ లోకసభకు, గజ్వేల్ అసెంబ్లీకీ పోటీ చేస్తున్నారని, తెరాసకు మంచి మెజారిటీ వస్తే తెలంగాణ సిఎం కావచ్చునని, ఒకవేళ గజ్వేల్లో ఓడిపోతే మెదక్ లోకసభ నుంచి గెలిచి కేంద్రంలో మూడో కూటమి ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుదామని కలలు కంటున్నాడని కానీ ఆయన రెండుచోట్లా ఓడిపోతాడన్నారు. కేంద్రంలో ఎన్డీయేదే అధఇకారమని, మూడోకూటమి కలలు కల్లలే అన్నారు.
కెసిఆర్ ఉపన్యాసాల తీరు, వ్యవహార శైలి ఘర్షణాత్మకంగా ఉన్నాయని దుయ్యబట్టారు. సీమాంధ్రులు హైదరాబాద్ను విడిచి వెళ్లాలని, వాళ్లకు తాగడానికి నీళ్లు కూడా ఇవ్వబోమని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్నదమ్ముల్లా ఉన్న రెండు ప్రాంతాల ప్రజలమధ్య విద్వేషం రేపుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తూనే, సీమాంధ్రకూ బిజెపి న్యాయం చేస్తుందని ప్రకటించారు.

తెలంగాణ ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేదని, బిజెపి ఒత్తిడి వల్లే ఇచ్చిందని స్పష్టం చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆ పార్టీ ఎన్నో నాటకాలు ఆడిందని, ఇరుప్రాంతాల్లో విద్వేషాలను రెచ్చగొట్టిందన్నారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్కు స్పష్టత లేనందునే తెలంగాణ, సీమాంధ్రలో అనవసర ఘర్షణలు చోటు చేసుకున్నాయన్నారు. తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ మీనమేషాలు లెక్కించిన కారణంగానే 1100మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని, అలాంటి పార్టీకి ఓటేస్తారా? అని ప్రశ్నించారు.
తాము మూడు రాష్ట్రాలను ఎలాంటి వివాదాలు లేకుండా ఇచ్చామని, తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ సీట్లు, ఓట్ల రాజకీయానికి పాల్పడిందని దుయ్యబట్టారు. తెలంగాణను అడ్డుకునేందుకు కాంగ్రెస్ చివరిదాకా కుట్రలు పన్నిందని, పార్లమెంట్లో గందరగోళం సృష్టించిందని చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా అప్పటి సీఎం కిరణ్ను ప్రోత్సహించిందని దుయ్యబట్టారు.
సుష్మా స్వరాజ్.. రాణి రుద్రమదేవికి ప్రణమిల్లారు. పోతన, దాశరథి వంటి మహాకవులను తలుచుకున్నారు. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అంటూ ఈ ప్రాంత గొప్పతనాన్ని కొనియాడారు. వరంగల్ జిల్లాలో ప్రస్తుతం నత్తనడక సాగుతున్న భారీ నీటి పారుదల ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధిపై బిజెపికి స్పష్టమైన అవగాహన ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోలేదంటూ అలాంటి పార్టీకి ఓట్లేసి గెలిపించొద్దన్నారు. సుష్మకు బిజెపి నేతలు కాకతీయ తోరణం జ్ఞాపికను బహూకరించి, పట్టుబట్టలతో సత్కరించారు.












Click it and Unblock the Notifications