KA Paul: తమ్ముడూ పవన్ అంతలా ఊగిపోక.. ప్రభువు మార్గంలో నడువు
77వ గణతంత్ర దినోత్సవ వేళ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన డాక్టర్ కేఏ పాల్ (KA Paul), దేశ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. గత 37 ఏళ్లలో చైనా సాధించిన ప్రగతిని, భారత్ ప్రస్తుత స్థితిని పోలుస్తూ అభివృద్ధి మంత్రం పఠించారు. మతపరమైన రాజకీయాలు పక్కన పెట్టి, దేశాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
1989లో తాను అమెరికా వెళ్లిన నాటి పరిస్థితులను కేఏ పాల్ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో భారత్, చైనాల జీడీపీ (GDP) సమానంగా ఉండేవని.. కానీ నేడు చైనా 21-22 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచ అగ్రగామిగా ఎదుగుతుంటే, భారత్ కేవలం 3 ట్రిలియన్ డాలర్ల వద్దే ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. "చైనా ఆ 37 ఏళ్లలో ప్రపంచానికే నంబర్ వన్ ఎలా అయింది? మనం ఎందుకు వెనుకబడ్డాం?" అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను కులమతాల పేరుతో రెచ్చగొట్టడం వల్లే అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శించారు.

లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్కు హితవు
తిరుమల లడ్డూ వివాదంపై స్పందిస్తూ, తాను ముందుగా చెప్పినట్లుగానే అక్కడ ఎలాంటి కల్తీ జరగలేదని పాల్ పునరుద్ఘాటించారు. "లడ్డూ పేరుతో హిందూ, ముస్లిం, క్రైస్తవులను రెచ్చగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ తమ్ముడు.. లడ్డూ కోసం అంతలా ఊగిపోవడం అవసరమా? ఇప్పటికైనా ప్రభువు మార్గంలో, శాంతి మార్గంలో, సత్య మార్గంలో నడువు" అంటూ ఏపీ ఉపముఖ్యమంత్రికి సలహా ఇచ్చారు. పనికిమాలిన చేష్టలు మాని, దేశాభివృద్ధి కోసం పని చేయాలని కోరారు.
ప్రజా సమస్యలే అజెండా కావాలి
ప్రజాప్రతినిధులు చిల్లర డిబెట్లు విడిచిపెట్టి నిరుద్యోగం, రైతు సమస్యలు, పేదరికం వంటి వాస్తవ సమస్యలపై దృష్టి పెట్టాలని పాల్ సూచించారు. "న్యాయ వ్యవస్థ ప్రభావితమవుతోంది, సత్యాన్ని చెప్పడానికి మీడియా భయపడుతోంది. ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఇండియా సర్వనాశనం అవుతుంది" అని హెచ్చరించారు. ప్రపంచ శాంతి కోసం భారత్ ప్రయాణం చేయాలని, యుద్ధాలను విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు.
ఫిబ్రవరి 22న చెన్నైలో 'ప్రపంచ శాంతి సభ'
భారతీయులు చైనీయుల కంటే తెలివైన వారని ప్రపంచమే ఒప్పుకుంటుందని, మన తెలివితేటలను దేశ నిర్మాణానికి వాడాలని కేఏ పాల్ అన్నారు. అమెరికాతో కలిసి తప్పుడు మార్గంలో వెళ్లకుండా, భారత్ను నంబర్ వన్ దేశంగా మార్చడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 22 (ఆదివారం) నాడు చెన్నైలో భారీ ఎత్తున 'ప్రపంచ శాంతి సభ' నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమాజాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
Dr K A Paul’s call to every Telugu citizen on this 77th Republic Day . pic.twitter.com/EkjxnuigmG
— Dr KA Paul (@KAPaulOfficial) January 26, 2026












Click it and Unblock the Notifications