వందేభారత్ సిద్దం, బెంగళూరుకు ఏడు గంటల్లో : ముహూర్తం ఫిక్స్, ధరలు ఇలా..!!
తెలుగు రాష్ట్రాల్లో మూడో వందేభారత్ పట్టాలెక్కనుంది. రెండు ఐటీ సిటీల మధ్య వందేభారత్ కోసం చాలా రోజలుగా ప్రయాణీకులు నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ఖరారైంది. ట్రయిల్ రన్ పూర్తయింది. ఈ నెల 15వ తేదీనే ప్రారంభం అవుతుందని అంచనా వేసినా, వాయిదా పడింది. తాజాగా టికెట్ ధరలను ఖరారు చేసారు. కొత్త రైలు సిద్దం చేసారు. తాజాగా ఈ నెల 31న ఈ రైలు ప్రారంభోత్సవానికి ముహూర్తంగా నిర్ణయించారు.
రెండు ఐటీ నగరాల మద్య: వందేభారత్ సర్వీసును కాచిగూడ నుంచి బెంగళూరుకు ప్రారంభించాలని మార్చిలోనే నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రెండు రూట్లలో రైళ్లు నడుస్తున్నాయి. వికారాబాద్ , తాండూరు, రాయచూరు, గుంతకల్లు మీదుగా ఒక లైన్ ఉంది. అదే విధంగా మహబూబ్ నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా మరో మార్గం ఉంది.

ఏ మార్గంలో వందేభారత్ ను నిర్వహించాలనే దాని పైన ఇప్పటికే అధికారులు రైల్వే బోర్డుకు నివేదిక అందించారు. కాచిగూడ మీదుగా బెంగళూరుకు ప్రతి రోజూ ఏడు ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. వారాంతపు రోజుల్లో ఒకటి, రెండు స్పెషల్ రైళ్లను అందుబాటులో ఉంటున్నాయి. అయినప్పటికీ ఈ రైళ్లలో సీట్లు దొరకడం గగనంగా మారుతోంది.
రూట్..ధరలు ఖరారు: కొత్తగా ప్రారంభిస్తున్న కాచిగూడ- యశ్వంత్పుర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ మొత్తం 618 కిలో మీటర్ల దూరాన్ని 7 .30 గంటల్లోనే చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా సాధారణ ప్రయాణంలో పట్టే సమయం నుంచి నాలుగు గంటల వరకు ఆదా అవుతుంది.ధర్మవరం, డోన్, కర్నూల్, గద్వాల్ జంక్షన్, మహబూబ్నగర్, షాద్నగర్ వంటి ప్రధాన స్టేషన్లను కలుపుకొని వెళ్లనుంది.
ఈ రైళ్లో 16 కోచ్ లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో రెండు ఎగ్జిక్యూటివ్, 14 ఛైర్ కార్స్ ఉంటాయి. ఏసీ ఛైర్ కార్లో రూ.1545 ఉండనుంది. వందేభారత్ టికెట్లలో క్యాటిరింగ్ ఛార్జీలతో కలిపి జారీ చేస్తున్నారు. ఈ టికెట్ లోనూ రూ 298 కేటరింగ్ ఛార్జీలుగా ఉండనున్నాయి. టికెట్ ధరలపైన అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
ఏడు గంటల్లోనే గమ్యానికి: రెండు ఐటీ నగరాల మధ్య ఉన్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని ఈ రైలును ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నడుస్తున్న ప్రధాన రైళ్ల రాకపోకల వేళల పై ప్రభావం పడకుండా సమయాల ఖరారు పైన కసరత్తు చేస్తున్నారు. దీని ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో రెండు ప్రధాన నగరాల మధ్య వందేభారత్ పట్టాలెక్కనుంది.
ఇప్పటికే రెండు సార్లు ప్రారంభిస్తామని చెప్పిన ముహూర్తాలు వాయిదా పడ్డాయి. దీంతో, ఇప్పుడు ఈ నెల 31న ప్రారంభించటానికి అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications