ముప్పుతిప్పలు పెట్టిన ప్రేమజంట: 32 సిమ్ములు, 8ఫోన్లు వాడారు
కడప: ఓ ప్రేమ జంట పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. ఒకసారి పారిపోతే తీవ్రంగా గాలించి వారిని పట్టుకొచ్చి తమ కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. కాగా, మరోసారి ఆ యువతి తన ప్రేమికుడితో వెళ్లిపోయింది. దీంతో మళ్లీ ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
మరోసారి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రెండు నెలలపాటు గాలింపు చేపట్టారు. కాగా, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఆ ప్రేమ జంట ఏకంగా 32 సిమ్కార్డులు, 8 సెల్ఫోన్లు వాడటం గమనార్హం. పోలీసులు తమదైన దర్యాప్తు చేయడంతో ఎట్టకేలకు వారిని పట్టుకున్నారు. ఆ యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
డీఎస్పీ వాసుదేవన్ తెలిపిన వివరాల ప్రకారం.. గాలివీడు మండలం అరవీడుకు చెందిన రమేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇది వరకే పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. ఈ సమయంలో అదే ప్రాంతాకి చెందిన 18ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.

ఆ యువతి కడపలోని ఓ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ఇద్దరు గతంలో ఓసారి పరారయ్యారు. అప్పుడు ఆ మహిళ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కడప పోలీసులు సికింద్రాబాద్కు వెళ్లి వారిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ యువతిని తల్లిదండ్రులు తిరిగి నర్సింగ్లో చేర్పించారు. అయినా ఆమెలో మార్పు రాలేదు.
తిరిగి 2015 డిసెంబరు 25వ తేదీ ఆమె వసతి గృహం గోడ దూకి రమేష్తో కలిసి పారిపోయింది. తిరిగి అమ్మాయి తల్లిదండ్రులు మహిళ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. హెడ్కానిస్టేబుల్ జేఎండీ పీరా కేసును అప్పగించారు. ఆయన వారి కోసం ముమ్మరంగా గాలించారు.
కాగా, ఆ ప్రేమజంట 32 సిమ్కార్డులు, 8సెల్ఫోన్లు ఉపయోగించారు. వారి జాడ తెలుసుకోవడం కోసం గత 2నెలలుగా గాలింపు కొనసాగించారు పోలీసులు. చివరికి వీరిద్దరు బళ్లారిలోని హోస్పేట్లో ఉన్నట్లు సమాచారం రావడంతో హెడ్కానిస్టేబుల్ వెళ్లి చాకచక్యంగా వారిని పట్టుకున్నారు.
ఆ జంటను బుధవారం మహిళ పోలీసుస్టేషన్లో డీఎస్పీ ఎదుట హాజరు పరిచారు. అనంతరం డీఎస్పీ.. ఆ యువతి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications