YS Avinash Reddy : తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్
పెదనాన్న వైఎస్ వివేకానందరెడ్డి (ys vivekananda reddy) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (ys avinash reddy) ఇవాళ తెలంగాణ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. ఈ కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి.. త్వరలో తాను అరెస్టు కావడం ఖాయమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తెలంగాణ హైకోర్టును ముందస్తు బెయిల్ కోరారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ సందర్భంగా తనను అరెస్టు చేసే అవకాశం ఉంది కాబట్టి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన ఈ కేసుకు సంబంధించి పలు అంశాల్ని, సీబీఐ విచారణ తీరును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే కేసులో సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరుతూ అవినాష్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పేసింది.

వివేకా హత్య కేసులో ఇప్పటికే నాలుగుసార్లు సీబీఐ విచారణకు హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డిని తదుపరి విచారణలో సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విచారణకు హాజరైన సందర్భంగా అవినాష్ సీబీఐ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నప్పటికీ అధికారులు మాత్రం తనను వేధిస్తున్నట్లు అవినాష్ భావిస్తున్నారు. దీంతో తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు కోరారు. అది ఫలించకపోవడంతో ఈసారి ముందస్తు బెయిల్ కోరినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications