వివేకా కూతురుపై రెక్కీ కేసు-నిందితుడు మణికంఠరెడ్డి అరెస్ట్- విచారిస్తున్న పోలీసులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి ఇంటిపై రెక్కీ నిర్వహించిన కేసులో నిందితుడు మణికంఠరెడ్డిని కడప పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. నిన్న తన ఇంటిపై మణికంఠరెడ్డి రెక్కీ నిర్వహించాడంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఆమె ఇంటి వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేయడంతో పాటు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇవాళ కడప పోలీసులు రెక్కీ నిర్వహించిన మణికంఠరెడ్డిని అరెస్టు చేశారు. వివేకా హత్య కేసును సీబీఐ కేసు విచారిస్తున్న తరుణంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన కుమార్తె సునీతారెడ్డి డీజీపీ, సీబీఐ, కడప జిల్లా ఎస్పీకి నిన్న ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి తమ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాడని ఆరోపిస్తూ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల 10న ఆ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగాడని, ఫోన్ కాల్స్ కూడా చేశాడని సునీతారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించి సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులకు అందజేశారు.దీంతో పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు నిందితుడు మణికంఠారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు మణికంఠరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... రెక్కీ నిర్వహించడానికి కారణాలు, ఎవరెవరికి ఫోన్లు చేశారు? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వివేకా హత్యక కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో ఏదైనా జరగొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతుున్నాయి. ముఖ్యంగా ఈ కేసులో నిందితుల వెనుక హై ప్రొఫైల్ వ్యక్తులు ఉన్నారంటూ వాచ్ మన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలం కూడా స్పష్టం చేయడంతో పోలీసులు, సీబీఐ అధికారులతో పాటు వివేకా కుటుంబ సభ్యులు కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో రెక్కీ జరగడంతో పోలీసులు ఈ వ్వవహారాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న మణికంఠరెడ్డి వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి అనుచరుడు కావడం విశేషం. దీంతో మణికంఠరెడ్డిని విచారిస్తే కీలక విషయాలు వెలుగుచూసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.