కడప టిడిపిలో సంక్షోభం...మంత్రి ఆది వైఖరిపై మండిపడుతున్న తెదేపా నేతలు
కడప:మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యవహారశైలిపై కడప జిల్లాలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. అంతేకాదు ఇలా మంత్రి ఆదిపై దండేత్తేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
తొలుత ఫిరాయింపు ఎమ్మెల్యే జయరాములుతో మొదలైన ఈ అసమ్మతి రాగాలు క్రమేపీ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి మంత్రి ఆదిపై ఫైర్ అవ్వగా తాజాగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మంత్రి తీరుపై పరోక్షంగా తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. మంత్రి జిల్లాలో టీడీపీని బలోపేతం చేయడం అటుంచి తానే గ్రూపు రాజకీయాలకు మరింత ఆజ్యం పోస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
వైసిపి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ ఫిరాయించి టిడిపి ప్రభుత్వంలో మంత్రి అయిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై కడప జిల్లా టిడిపి నేతలు ఆగ్రహంతో మండిపోతున్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన బద్వేల్లో ఫిరాయింపు ఎమ్మెల్యే జయరాములు, గతంలో అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన విజయజ్యోతి ఇరువురు సంయుక్తంగా టిడిపి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే మంత్రిగా ఉన్న ఆది వారి మధ్య విభేదాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించే ప్రక్రియ చేపట్టాల్సిందిపోయి తద్వారా తాను లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నట్లు అక్కడి నేతలు ఆరోపిస్తున్నారు. అందుకు మాజీఎమ్మెల్యే విజయమ్మ సూచించిన వారికే ఇక్కడ పార్టీ టికెట్ అంటూ మంత్రి ఆది చేసిన ప్రకటనే నిదర్శనమంటున్నారు.
దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములు మంత్రి ఆదిపై విమర్శల వర్షం కురిపించారు. నాలాగా నీవు కూడా టీడీపీలో వలసవాదివే, అదృష్టం బాగుండీ మంత్రి అయ్యావు, పార్టీ టికెట్లు కేటాయింపు వ్యవహారంలో నీ స్థాయి ఏంటంటూ మండిపడిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు టికెట్ నాదే అంటూ బహిరంగంగా ప్రకటించడంతో ఆది వ్యవహార శైలిని అప్పటి వరకు భరిస్తూ వచ్చిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఒక్కసారిగా మంత్రిపై విరుచుకుపడ్డారు. ఎప్పటిలాగే దేవగుడి కుటుంబంతో ఉన్న తమ రాజకీయ వైరం కొనసాగుతున్నట్లేనని స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కూడా ఆదివారం మంత్రి ఆది వైఖరిపై మండిపడ్డారు. నిన్నగాక మొన్న టీడీపీలోకి వచ్చిన ఆదినారాయణరెడ్డి అసలు ఇప్పుడే టికెట్ల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు? ఏ జిల్లాలో లేని గొడవలు ఇక్కడ ఎందుకు సృష్టిస్తున్నారని నిలదీశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు వర్గీయులు సైతం మంత్రిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి ఆది కనీసం తమ ఉనికిని కూడా గుర్తించనట్లు వ్యవహరిస్తూ మాజీ ఎమ్మెల్యే రమేష్రెడ్డిని ప్రోత్సహిస్తున్నారని వారు వాపోతున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం పులివెందుల మినీ మహానాడులో మంత్రి ఆదినారాయణ రెడ్డిపై రామసుబ్బారెడ్డి పరోక్షంగా పలు విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయాలు ప్రజలకు సేవ చేసేందుకే కానీ, వారిపై పెత్తనం చెలాయించేందుకు కాదంటూ ఆయన మంత్రి ఆదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తాము పార్టీలో ఉంటూ ఎన్నో కష్టాలు పడ్డామని, అయినా ఏనాడు పార్టీ వీడలేదన్నారు. పార్టీ కోసం జైలుకు కూడా వెళ్లామని, అలాంటి పరిస్థితుల్లో కూడా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని సీఎం చెబితే గౌరవిస్తున్నామని చెప్పారు. కానీ కొంత మంది స్టేట్మెంట్లు చాలా బాధ కలిగిస్తున్నాయని చెప్పారు. నాయకులను, కార్యకర్తలను విమర్శిస్తే పార్టీకే నష్టమని, నేను ఇప్పుడు అలాంటి వారి గురించి చెబితే పార్టీకి నష్టం కలుగుతుందని ఆగుతున్నానన్నారు. మాట్లాడే రోజు వచ్చినపుడు తప్పకుండా మాట్లాడతానని రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు.