కాకినాడ కౌంటింగ్: నంద్యాల ఎఫెక్ట్ పనిచేస్తుందా?, భీమవరంలో రూ.1కోటి బెట్టింగ్
ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేయగా, ప్రతీ టేబుల్ మీద ఒక ఈవీఎం ఏర్పాటు చేశారు.
కాకినాడ: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో మొదలుకానుంది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేయగా, ప్రతీ టేబుల్ మీద ఒక ఈవీఎం ఏర్పాటు చేశారు. 24 రౌండ్ల తర్వాత పూర్తి ఫలితాలు వెల్లడి చేయనున్నారు.
ఆరు రౌండ్లు పూర్తయేసరికి 14డివిజన్ల ఫలితాలు తెలియవచ్చే అవకాశం ఉంది. 14 డివిజన్లకు సంబంధించిన 1వ నెంబర్ ఈవీఎంలను తొలుత లెక్కిస్తారు. కొన్ని డివిజన్లకు సంబంధించిన ఫలితాలు 3 రౌండ్లలోనే వెలువడే అవకాశం ఉంది. ఒక్కో రౌండ్ కు 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టవచ్చని, ప్రతి గంటకు సగటున 14 డివిజన్ల ఫలితాలు వెల్లడవుతాయని అంచనా.
బరిలో ఎవరెవరు?:
మొత్తం 241మంది అభ్యర్థులు బరిలో నిలిచిన ఈ ఎన్నికలో టీడీపీ 39 డివిజన్లలో, బీజేపీ 9 డివిజన్లలో బరిలోకి దిగగా, వైసీపీ 48 డివిజన్లలోనూ పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ 17 చోట్ల, సీపీఐ, సీపీఎం రెండు చోట్ల, బీఎస్పీ 3 చోట్ల పోటీ చేశాయి. కాగా, కాకినాడ కార్పోరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉండగా, 48 డివిజన్లకే పోలింగ్ జరిగింది. హైకోర్టులో విచారణ కారణంగా మిగిలిన రెండు డివిజన్లకు పోలింగ్ నిర్వహించలేదు.
గతంలో టీడీపీకి పట్టు లేదు:
నంద్యాల ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితమే ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని టీడీపీ నమ్మకంతో ఉంది. కానీ గతాన్ని పరిశీలిస్తే మాత్రం ఆ పార్టీకి అంత అనుకూల పరిస్థితులేమి కనిపించడం లేదు. కాకినాడ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో ఇక్కడ జెండా పాతడంలో టీడీపీ విఫలమైంది. ఇక కార్పోరేషన్ గా ఏర్పడ్డ తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ సత్తా చాటింది. కానీ ప్రస్తుత పరిస్థితులు ఆ పార్టీకి ఏమాత్రం అనుకూలంగా లేవన్నది అందరికీ తెలిసిందే.
నంద్యాల ఎఫెక్ట్, టఫ్ ఫైట్:
ఈ నేపథ్యంలో టీడీపీ-వైసీపీ మధ్యే మరోసారి టఫ్ ఫైట్ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరు పార్టీల అధినేతలు సైతం స్వయంగా ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల వెలువడిన నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు టీడీపీకి ఊపునిచ్చాయి. అదే విశ్వాసంతో ఈ ఎన్నికల్లోను గెలుస్తామన్న ధీమా వారిలో ఏర్పడింది. అయితే ఓటర్ల మనోగతంపై నంద్యాల ఫలితం ఏ మేరకు ప్రభావం చూపించనేది తెలియాలంటే ఫలితాలు వచ్చేవరకు ఆగాల్సిందే.
జోరుగా బెట్టింగ్స్:
టీడీపీ కూటమి 30 నుంచి 35 డివిజన్లు గెలుచుకుటుందని కొందరు బెట్టింగ్స్ పెట్టగా.. మరికొందరు వైసీపీ 25 నుంచి 30 డివిజన్లలో గెలుస్తుందని బెట్టింగ్స్ పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. నంద్యాల ఫలితం ప్రభావితమో.. మరేమో కానీ బెట్టింగ్స్ లోను వైసీపీ తరుపున బెట్ చేయడానికి చాలా తక్కువ మంది మాత్రమే ముందుకు వస్తున్నారట. భీమవరంకు చెందిన ఓ వ్యక్తి కాకినాడ ఎన్నికలపై ఏకంగా రూ.1కోటి బెట్టింగ్స్ పెట్టినట్లు తెలుస్తుండటం గమనార్హం.