"ఆ ఒక్కటి తప్ప జగన్కు విజయ్ మాల్యాకు తేడా ఏముంది?"
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జగన్-మోడీ భేటీ అనేక రకాల చర్చలకు తావిచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో తెగదెంపులు చేసుకుని వైసీపీతో నడవడాలనేది బీజేపీ ఆలోచన అని అ
అమరావతి: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జగన్-మోడీ భేటీ అనేక రకాల చర్చలకు తావిచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో తెగదెంపులు చేసుకుని వైసీపీతో నడవడాలనేది బీజేపీ ఆలోచన అని అందుకే జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ఈ తరహా ప్రచారంతో ఇప్పుడు టీడీపీ గుండెల్లో రాయి పడ్డట్లయింది. దీంతో ఆ పార్టీ నేతలంతా మూకుమ్మడిగా జగన్ పై ఎటాక్ కు సిద్దమయ్యారు. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు జగన్ పై మండిపడ్డారు. రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకే మోడీని కలిస్తే.. ఎందుకు దాన్ని రహస్యంగా ఉంచారని ప్రశ్నించారు.
ఆర్థిక ఉగ్రవాది అన్న తమ పార్టీ నేతల వ్యాఖ్యలకు మరింత పదును పెడుతూ.. ఎమ్మెల్యే అన్న హోదా తప్ప జగన్కు, విజయ్ మాల్యాకు తేడా ఏముంది? అని కళావెంకట్రావు ఘాటుగా స్పందించారు. ఆస్తులు జప్తు చేయబడితే.. సగం నేరం రుజువైనట్లేనన్నారు.
మోడీతో భేటీ విషయంపై జగన్ కు కళావెంకట్రావు శనివారం నాడు లేఖ రాశారు. అందులో 9ప్రశ్నలు సంధించినట్లుగా తెలిపారు. ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో ప్రత్యేక హోదాను ఎందుకు చేర్చలేకపోయారని ప్రశ్నించారు. హోదా ఇవ్వకపోతే జూన్ నాటికి తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్.. దానికి కట్టుబడి ఉంటారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతునిస్తామని మోడీతో ఎందుకు చెప్పలేకపోయారని నిలదీశారు.