పార్ట్ టైమ్ పొలిటిషియన్: 'కేసీఆర్ను విమర్శించాలంటే జగన్కు ఎందుకంత భయం'?
అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కుమ్మక్కయ్యారని ఏపీ చీఫ్ విఫ్ కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ చేపట్టిన మూడు రోజుల జలదీక్షపై ఆయన స్పందించారు.
సోమవారం ఆయన మాట్లాడుతూ జగన్పై తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ పార్ట్ టైమ్ పొలిటిషియన్ అంటూ దుయ్యబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు జగన్ ప్రతిపక్ష హోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ను విమర్శించాలంటే జగన్కు ఎందుకంత భయం అని నిలదీశారు.
మిగులుజలాలు అడగబోమని, బ్రిజేష్ ట్రిబ్యునల్కు ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పలేదా? అని ఆయన ప్రశ్నించారు. రాజధాని, పట్టిసీమను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ జలదీక్షకు పూనుకున్నారని ఆరోపించారు.
వైయస్ హయాంలోనే ప్రాజెక్టుల పేరిట ధన దోపిడీ చేశారని మండిపడ్డారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై ముందుగా ప్రభుత్వమే స్పందించిందని, ఆ ప్రాజెక్టులపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జగన్కు జలదీక్ష చేసే అర్హత లేదు: మంత్రి నారాయణ
వైసీపీ అధినేత వైయస్ జగన్కు జలదీక్ష చేసే అర్హత లేదని ఏపీ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాయలసీమకు నీళ్లు అందించే పట్టీసీమను ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అసలు జలదీక్ష ఎందుకు చేస్తున్నారో వివరణ ఇవ్వాలని దుయ్యబట్టారు.
టీడీపీలోకి మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు: కేఈ ప్రతాప్
త్వరలో మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారని కేఈ ప్రతాప్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలో వైసీపీ పూర్తిగా ఖాళీ అవడం ఖాయమన్నారు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలానికి చెందిన కొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కేఈప్రతాప్ సమక్షంలో టీడీపీలో చేరారు.