ఆధారాలున్నాయి: బొత్సకు కాల్వ కౌంటర్, 'గవర్నర్'పై వెనక్కి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ సవాల్ను తాము స్వీకరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు శుక్రవారం స్పష్టం చేశారు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలకు తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు.
తమ పార్టీ నాయకులు కొందరు ఆవేదనతోనే కొందరు గవర్నర్ నరసింహన్ పైన వ్యాఖ్యలు చేశారని చెప్పారు. వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. తాము తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదన్నారు.
పొగాకు రైతులతో చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా శుక్రవారం పొగాకు రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతులను వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని సక్రమ పద్ధతుల్లోనే గిట్టుబాటు ధర చెల్లించి, కొనుగోళ్లు చేయాలని ఆయన పొగాకు వ్యాపారులను హెచ్చరించారు. టుబాకో బోర్డు, ఎస్టిసి ద్వారా కొనుగోళ్లు జరిపించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
'సెక్షన్ 8 అవసరం లేదు'
హైదరాబాద్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో సెక్షన్ 8 అవసరమే లేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్లో ఆంధ్రా పోలీస్ స్టేషన్లు పెట్టడమంటే తెలంగాణ హక్కులను హరించడమే అని మండిపడ్డారు.