బాబుపై కవిత నిప్పులు, చంద్రబాబు రావొచ్చు కానీ.. కిషన్ నిలదీత
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గురువారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతల కోసమే చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు పర్యటనతో తెలంగాణ రాష్ట్ర సమితికి ఎలాంటి నష్టం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో సభ్యత్వం ఇప్పటి వరకు యాభై లక్షలకు చేరుకుందని చెప్పారు. చంద్రబాబు పర్యటనను పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి పర్యటనలా చూస్తామని చెప్పారు.
ఎవరైనా ఎక్కడైనా పర్యటించవచ్చు: కిషన్ రెడ్డి
ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చునని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చునని చెప్పారు. అయితే, విద్యుత్ విషయంలో టీడీపీ స్పష్టత ఇవ్వాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం హామీలకే పరిమితమైందని చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణలో తమ సభ్యత్వం పదహారు లక్షలుగా ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారికి తెరాస ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. కోదండరాంకు ప్రాధాన్యత ఏదని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల పెంపును విరమించుకోవాలన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజాగ్రహం తప్పదని కాంగ్రెస్ నేత డీకే అరుణ అన్నారు.
భౌగోళికంగా విడిపోయినా...మానసింగా కలిసే ఉందాం: చంద్రబాబు
రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినా తెలుగు ప్రజలు మానసికంగా కలిసే ఆండాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. వరంగల్ పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు ఉప్పల్, భువనగిరిలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా భువనగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.
మాధవరెడ్డి తనకు ప్రాణమిత్రుడని గుర్తుచేసుకున్నారు. నల్గొండ జిల్లాకు కృష్ణా నీటిని తెచ్చిన ఘనత టీడీపీదే అని బాబు వెల్లడించారు. రెండు రాష్ర్టాలు అభివృద్ధి చెందాలనేదే తమ ఆకాంక్ష అన్న ఆయన ఇరు రాష్ర్టాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.