ఎందుకు చెప్పలేదు: చంద్రబాబుపై కల్వకుంట్ల కవిత
వరంగల్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణపై ప్రేమ ఉంటే, బతుకమ్మ శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం వరంగల్లోని చారిత్రక వేయి స్తంభాల గుడిలో ఏర్పాటు చేసిన సంబరాల్లో ఆమె పాల్గొన్నారు.
బతుకమ్మ పండుగకు తెలంగాణ ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసిన అంశంపై టీడీపీ చేసిన ఆరోపణలపై ఆమె తీవ్రంగా ప్రతిస్పందిచారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.10కోట్లలో జిల్లాకు రూ.10 లక్షల చొప్పున కేటాయించి, మిగిలిన రూ.9 కోట్లను ఒక్క హైదరాబాద్ ఉత్సవాలకే వెచ్చించనున్నట్లు కవిత వెల్లడించారు. బతుకమ్మ వేడుకలకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.
హైదరాబాద్లో నిర్వహించే బతుకమ్మ వేడుకలకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించనున్నామన్నారు. ప్రపంచంలో పువ్వులతో దేవుళ్లను కొలిచే ఆచారం ఉందని, పువ్వులనే దేవతలుగా కొలిచే గొప్ప సంస్కృతి ఒక్క తెలంగాణకే పరిమితమన్నారు. ప్రపంచంలో ఫెస్టివల్ ఆఫ్ లవర్స్ అంటే, బతుకమ్మనే అనేలా ఈ పర్వదినానికి గుర్తింపు తెస్తామన్నారు.
తెలంగాణ జాగృతి పేరిట ఎనిమిదేళ్లుగా బతుకమ్మ అస్తిత్వం కోసం ఉద్యమిస్తున్న క్రమంలో ఈసారి సొంత రాష్ట్రంలో బంగారు బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. వరంగల్లోనే బతుకమ్మ పుట్టిందన్న వార్తల నేపథ్యంలో ఇక్కడే బతుకమ్మ ఆడుకోవడం, తన పుట్టింటికొచ్చినంత ఆనందంగా ఉందని ఆమె చెప్పారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి రాజయ్య, ఎంపీలు సీతారాంనాయక్, రాపోలు ఆనందభాస్కర్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్నాయక్, జడ్పీ చైర్పర్సన్ జి.పద్మ, జిల్లా కలెక్టర్ జి.కిషన్ తదితరులు పాల్గొన్నారు.