ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక దాడి: విచారణకు ఆదేశించిన కామినేని
విజయవాడ: ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆస్పత్రిలోని సర్జరీ వార్డులో రోగిపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణపై ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. పరీక్షల నిమిత్తం వచ్చిన ఓ రోగిపై రేడియోలజీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడనే ఆరోపణపై కూడా మంత్రి విచారణకు ఆదేశించారు.
ఈ రెండు సంఘటనలు కూడా ప్రభుత్వాస్పత్రిలో మంగళవారంనాడు చోటు చేసుకున్నాయి. కడుపు నొప్పి కారణంగా ఓ 17 బాలిక తన సోదరితో, తల్లితో కలిసి ఆస్పత్రికి వచ్చింది. ఎన్టీఆర్ వైద్య విజ్ఞాన సంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన వైద్యుడు పరీక్షించే నెపంతో ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వచ్చాయి.
వైద్యుడి వేధింపులకు బెదిరిపోయిన బాలిక బయటకు పరుగెత్తుకుని వచ్చి తల్లికి ఫిర్యాదు చేసింది. ఇతర సిబ్బందితో కలిసి వైద్యుడు వివాదాన్ని పరిష్కరించుకున్నాడు.
మరో కేసులో ఓ రేడియోలజీ డిపార్టుమెంటులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి కె. రత్నాకర్ డబ్బులు ఇవ్వడానికి వచ్చిన మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. రత్నాకర్ను ఆస్పత్రి అధికారులు హెచ్చరించారు.
అయితే, ఆ సంఘటనలు గురువారంనాడు మంత్రి కామినేని దృష్టికి వచ్చాయి. దీంతో ఆ సంఘటనలపై శాఖాపరమైన విచారణకు మంత్రి ఆదేశించారు. రత్నాకర్ను ఉద్యోగం నుంచి తొలగించారు. దోషిగా తొలగితే వైద్యుడిని సస్పెండ్ చేస్తారు.