రాష్ట్రాన్ని కెసిఆర్ విభజించినా బాగుండేదేమో: మంత్రి కామినేని వ్యాఖ్యలు
విజయవాడ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించినంత ఘోరంగా తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు కూడా విభజించేవాడు కాదేమోనని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో ఎందుకు చేర్చలేదో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆయన గురువారం మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు రాజకీయ డ్రామేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు.
ఏపీ ఎంసెట్లో అక్రమాలు జరగలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్ మెడికల్ పరీక్షలో ఎలాంటి అక్రమాలు జరగలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. 15శాతం ఓపెన్ కోటాలో తెలంగాణ విద్యార్థులు చేరితే, ఏపీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆప్షన్ల ఎంట్రీని వాయిదా వేసినట్లు చెప్పారు.
ఆగస్టు 6,7 తేదీలలో ఆప్షన్ల ఎంట్రీకి అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ ఎంసెట్ ఆలస్యమైతే ఏపీ విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. అంతేగాక, ఏపీలో పీజీ మెడికల్ సీట్లు తీసుకున్నవారు ఖచ్చితంగా చేరాలని మంత్రి చెప్పారు. సీట్లు రద్దు చేసుకుంటే రూ. 2లక్షలు కట్టాలని, లేదంటే వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరగదని తేల్చి చెప్పారు.