మా సామాజిక వర్గం జోలికొస్తే సహించం - కమ్మ సంఘాల హెచ్చరిక..!!
రెండు తెలుగు రాష్ట్రాల్లోని కమ్మ వర్గీయులను ఒకే తాటిపైకి రానున్నాయి. కమ్మ సామాజిక వర్గం పడుతున్న ఇబ్బందులను సమిష్ఠిగా ఎదుర్కోవాలని ఆ సామాజిక వర్గ నేతలు నిర్ణయించారు. అదే సమయంలో కమ్మ సామాజిక వర్గం జోలికొచ్చినా.. స్వార్ధ ప్రయోజనాల కోసం అనుచిత వ్యాఖ్యలు చేసినా సహించబోమని అఖిల భారత కమ్మ సంఘాల హెచ్చరించాయి. కాకినాడలో జిల్లా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో విస్తృత సమావేశం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఒడిశా, కర్ణాటక కమ్మ సంఘాల నేతలు పాల్గొన్నారు.
కమ్మ సామాజిక వర్గీయులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు డిసెంబర్ లో జాతీయ కమ్మ మహా సంఘాల సమాఖ్యను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పూర్వ కాలం నుంచి వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో రాణిస్తూ లక్షలాదిమంది ప్రజలకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న కమ్మ సామాజికవర్గంపై రాజకీయ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏమాత్రం సహించేదిలేదని అఖిల భారత కమ్మ సామాజికవర్గం వేదిక హెచ్చరించింది. తమ సంఘానికి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని స్పష్టంచేశారు.
కమ్మ సామాజిక వర్గమంటే కుల సంఘం కాదని చెప్పారు. ఏపీ, తెలంగాణలో ఉన్న కోటి మందితో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న మరో కోటిమందిని ఒకే వేదికపై తీసుకొచ్చి అఖిల భారత కమ్మ మహాజన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి తొలి అడుగుగా ఈ సమావేశాలు నిర్వహించారు. అమరావతి రాజధానికే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సామాజికవర్గాన్ని ఎత్తిచూపితే ఎంతమాత్రం సహించేది లేదని వారు హెచ్చరించారు.
సంఘం తరపున ఏటా సుమారుగా అయిదు కోట్ల రూపాయాల వేతనాలు అందిస్తున్నామని సంఘాల నేతలు చెప్పారు. అందులో కమ్మ, ఇతర వర్గాల పేద విద్యార్ధులు ఉన్నారని వివరించారు. కుల మతాలకు అతీతంగా రైతులకు వరి సాగుపై శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దానదర్మాలు.. రక్తదాన - వైద్య శిబిరాలను పేదల కోసం నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. కమ్మ సామాజిక వర్గం పడుతున్న పలు ఇబ్బందులను సమిష్టిగా ఎదుర్కోవాలని నిర్ణయించారు.