'చంద్రబాబు చావు తెలివితేటలు, రాహుల్ గాంధీ మెప్పు కోసం బీజేపీపై విమర్శలు'
అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోంది నవ నిర్మాణ దీక్ష కాదని, వంచన దీక్ష అన్నారు. చంద్రబాబుది అన్నం పెట్టే చేతిని నరికే చావు తెలివితేటలు అన్నారు.
కేంద్రం నిధులను దారి మళ్లించి టిడిపి అవినీతికి పాల్పడుతోందన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. రెండు నెలల్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం అన్నారు. బీజేపీతోనే అభివృద్ధి, అవినీతిరహిత పాలన సాధ్యమన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మలేదని ఖాతాదారులకు, ఏజెంట్లకు అన్యాయం చేస్తున్నారన్నారు.
చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి అద్దెమైకులా తయారయ్యారన్నారు. ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్దంగా జన్మభూమి కమిటీలను నియమించాలన్నారు. చంద్రబాబును నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ లోపాయికారీ ఒప్పందం చేసుకుందని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ మెప్పు కోసం చంద్రబాబు, టీడీపీ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారన్నారు. టీడీపీ నేతలంతా అవినీతిలో కూరుకుపోయారన్నారు. బీజేపీపై టీడీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు. ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటుతామనే ధీమాను వ్యక్తం చేశారు.
కాగా, కన్నా విజయవాడలోని పార్టీ కార్యాలయానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా కన్నాకు పలువురు బీజేపీ నేతలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.