దిగజారిపోయిన పోలీస్ వ్యవస్థ...అధికారపార్టీ నేతల అక్రమాలకే వాళ్లు కాపలా:కన్నా
విజయవాడ:అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు చంపండం పిరికిచర్యగా ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభివర్ణించారు. మావోయిస్టుల చర్యను బీజేపీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
సోమవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎపిలో పోలీస్ వ్యవస్థ దారుణంగా దిగజారిపోయిందని అన్నారు. రాష్ట్రంలో పోలీసులకు అధికార పార్టీ నాయకుల అక్రమాలకు కాపలా కాయడమే వృత్తిగా మారిందన్నారు. ప్రతిపక్షాలు రాఫెల్ కుంభకోణం అంటూ ఒక జరగని కుంభకోణాన్ని జరిగినట్లు చిత్రీకరణ చేస్తున్నాయని కన్నా మండిపడ్డారు.
పోలీసు వ్యవస్థ...విఫలం
ఆంధ్రప్రదేశ్ లో పోలీసు, ఇంటెలిజెన్సు వ్యవస్థ ఘోరంగా విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థను తెలంగాణలో ఎన్నికల సర్వేల కోసం, సొంత ప్రయోజనాల కోసం టీడీపీ వాడుకోంటోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్లు తెరవాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రలతల విషయంలో దృష్టి సారించాలని సూచించారు.
చంద్రబాబు...నాటకాలు
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబును ఒక ఏజెన్సీ పిలిస్తే అమెరికా పర్యటన వెళ్లారని...అయితే ఆయన ఐక్యరాజ్యసమితి సమావేశానికి వెళుతున్నట్లు నాటకాలు ఆడుతున్నారని కన్నా ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు మళ్లీ వ్యవసాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నదుల్లో చెరువుల్లో మట్టిని, ఇసుకను తవ్విన చంద్రబాబు పర్యావరణ గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
అందుకే...మోడీపై విమర్శలు
ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి ప్రధాని నరేంద్ర మోడీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ...ఏపీ సీఎం చంద్రబాబుతో స్నేహం చేయడం వల్లే మోడీపై గాలి విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2007లో యూపీఏ హయాంలోనే రాఫెల్ యుద్ద విమానాల కోసం టెండర్లు పిలిచారని కన్నా గుర్తుచేశారు.
జరగని దాన్ని...జరిగినట్లుగా చిత్రీకరణ
అసలు విమానాల కొనుగోలుకు మోడీకి ఎటువంటి సంబంధం లేదని కన్నా తేల్చేశారు. లోకల్ అసిస్టెన్సీ కోసమే రిలయన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. ఒక జరగని కుంభకోణాన్ని జరిగినట్లుగా ప్రతిపక్షాలు చిత్రీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రాఫెల్ యుద్ద విమానాల ధర విషయంలో అనుమానాలుంటే కాగ్తో విచారణ జరిపించుకోవాలని ఆరుణ్ జైట్లీ విసిరిన సవాల్ను విపక్షాలు స్వీకరించాలన్నారు.