ఎపిలో బిజెపి ఉనికి చాటేందుకే...కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు:సిఎం రమేష్
న్యూఢిల్లీ: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో మనుగడ కోల్పోతున్న బిజెపి ఉనికి చాటేందుకే కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
పోలవరం నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రం నుంచి వచ్చిందేనని కన్నా చెబుతున్నారని...కానీ అది అబద్దమన్నారు. బుధవారం సిఎం రమేష్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పోలవరం నిర్మాణానికి రాష్ట్రం ప్రభుత్వం ఖర్చు చేసిన దానికి కేంద్రం ఇంతవరకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందన్నారు. అసలు నిజం ఇదేనన్నారు.
పోలవరం ప్రాజెక్ట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధపెట్టారని సిఎం రమేష్ ఈ సందర్భంగా తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ రాయలసీమకు వరం అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఎపి ప్రభుత్వం పెట్టిన ఖర్చును కేంద్రం వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కడపలో స్టీల్ప్లాంట్ కోసం దీక్ష చేయాలని తాము నిర్ణయించుకునట్లు సిఎం రమేష్ చెప్పారు.
దీక్షకు ముందు కడపలో స్టీల్ప్లాంట్ ఏర్పాటు విషయమై ప్రధాని నరేంద్ర త్వరలో కలవనున్నట్లు చెప్పారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని సిఎం రమేష్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం అంటూ వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలతో ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. ఏపీకి మేలు చేయాలనే ఉద్దేశం కేంద్రానికి లేదని రమేష్ విమర్శించారు.