పవన్ను తప్పుబట్టిన వెంకటరమణమూర్తి: సూసైడ్ నోట్లో రాసింది ఇదే
కాకినాడ: కాపు ఐక్య గర్జన హింసాత్మక ఘటన మరువకముందే కాపు సామాజిక వర్గానికి చెందిన చీకట్ల వెంకటరమణమూర్తి సోమవారం కాకినాడ కలెక్టరేట్లో ఆత్మ బలిదానం చేసిన సంగతి తెలిసిందే. న్యాయం కావాలి.. న్యాయం జరగాలి.. మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం ఇకనైనా మేల్కొని కాపులకి మిగిలిన కులాలతో సమానంగా హక్కులు కల్పించాలి... అంటూ సూసైడ్ నోటు రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. కాకినాడ డెయిరీ ఫారం సెంటర్లోని రాజీవ్ గృహకల్పకు చెందిన చీకట్ల వెంకటరమణమూర్తి (51) సినిమారోడ్డులోని డీజిల్ హౌస్లో డీజిల్ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య పార్వతి, కుమార్తెలు రాజేశ్వరి, చాముండేశ్వరి, కుమారుడు రాజేష్ ఉన్నారు.

పెద్ద కుమార్తె రాజేశ్వరికి వివాహం కావడంతో ఆమె వేరేగా ఉంటోంది. వెంకటరమణమూర్తి సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని బెన్నెట్ క్లబ్ మేడపైకి ఎక్కి అక్కడ ఏర్పాటు చేసిన టీవీ డిష్కు నైలాన్ తాడు కట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సామాజిక, ఆర్థిక రంగాల్లో కాపులు ఎంతో వెనుకబడి ఉన్నారని, 90 శాతం మార్కులు సంపాదించినా కాపు విద్యార్థులకు భవిష్యత్తు లేదని వెంకటరమణమూర్తి తన ఆత్మహత్య లేఖలో రాశారు.
అంతేకాదు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి కాపులను ఉద్ధరిస్తాడనుకున్నామని, అయితే అందుకు భిన్నంగా పవన్ ఉన్నాడని సూసైడ్ లేఖలో పేర్కొనడం చర్చనీయాంశగా మారింది. కాపు ఐక్య గర్జన అధ్యక్షుడు ముద్రగడ పద్మనాభం, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, దాడిశెట్టి రాజా తదితరులు వెంకటరమణమూర్తి మార్చురీ వద్ద మృతదేహాన్ని పరిశీలించారు.

అనంతరం ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ చీకట్ల వెంకటరమణమూర్తి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. మరోవైపు తుని ఘటన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ముద్రగడ పద్మనాభం సొంతూరులో ముందు జాగ్రత్తగా కిర్లంపూడిలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సూసైడ్ నోట్లో చీకట్ల వెంకటరమణమూర్తి ప్రస్తావించిన అంశాలు:
* మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం ఇకనైనా మేల్కొని కాపులను బీసీల్లో చేర్చాలి
* సమాజంలో ఒక వ్యక్తి ఆర్థిక స్థితిగతులు కులంపై ఆధారపడి ఉండవని ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలి
* కాపులను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తారు
* కాపు విద్యార్థి 90 శాతం మార్కులు సాధించినా సీట్లు సంపాదించడానికి పాట్లు పడుతున్నారు.
* కాపు కులస్తులు 90 శాతం మంది మధ్య తరగతిలో ఉన్నారు.
* ఆర్థికంగా మిగిలిన కులస్తులుతో పోల్చినా కాపులు ప్రతీ రంగంలోను వెనుకబడి ఉన్నారు.
* పవన్ కళ్యాణ్ కాపులకు ఏదో ఒక న్యాయం చేస్తారని ఎదురుచూశాం.
* చివరికి మాకు ఎదురు చూపు మాత్రమే మిగిలింది. మాది ప్రశ్నించే పార్టీ అని విన్నవించుకున్నారు. కాని చివరకు ప్రశ్నలు లేని పార్టీగా మిగిలిపోయింది.
* కాపు ఐక్య గర్జన ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా.












Click it and Unblock the Notifications