పవన్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మీకేంటీ?- జగన్పై హరిరామ ఫైర్
అమరావతి: కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు సంధించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించడాన్ని తప్పుపట్టారు. వైఎస్ జగన్ను విలన్గా అభివర్ణించారు. ఈ క్రమంలో జగన్ తాత వైఎస్ రాజారెడ్డి పేరును సైతం లాగారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను రాశారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని, మొదట్లో ఆయనను విమర్శించినా.. ఆ తరువాత ఆయనకు అభిమాని అయ్యానని గుర్తు చేశారు. వైఎస్సార్ చేసే విమర్శలు హుందాగా ఉండేవని పేర్కొన్నారు. ఆ విమర్శల్లో పదోవంతు హూందాతనం కూడా జగన్లో లేవని అన్నారు.

పవన్ కల్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు హరిరామ. చట్టపరంగా ఆయన ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా కూడా ప్రజలకు లేని అభ్యంతరం జగన్కు ఎందుకు? అని ప్రశ్నించారు. భార్యభర్తలు చట్టపరంగా విడిపోయిన తరువాత మరో పెళ్లి చేసుకోవడం తప్పు కాదని సమర్థించారు.
పవన్ కల్యాణ్ను జగన్ చంద్రబాబుకు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శించడం పట్లా హరిరామ అభ్యంతరం వ్యక్తం చేశారు. 2019లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు దత్తపుత్రుడిగా వ్యవహరించలేదా? అంటూ జగన్పై ఆరోపణలు చేశారు. ఓటర్లను కొనుగోలు చేయడానికి జగన్ కోట్లాది రూపాయల ప్యాకేజీని తీసుకున్నారంటూ మండిపడ్డారు.

వైఎస్ రాజారెడ్డి దగ్గరి నుంచి ఇప్పటివరకు అందరూ దోచుకోవటం, దాచుకోవటం అలవాటేనని హరిరామ జోగయ్య విమర్శించారు. ఇకముందు పవన్పై అనవసరంగా దుర్భాషలాడటాన్ని మానుకోవాలని, లేదంటే ఒకటికి నాలుగు అనిపించుకోవాల్సి ఉంటుందని అన్నారు. పవన్పై విమర్శలు చేయాలంటూ ఏ సలహాదారుడు సూచించారని ప్రశ్నించారు.
తప్పని పరిస్థితుల్లోనే ఈ విమర్శలు చేస్తోన్నానంటూ హరిరామ జోగయ్య వివరించారు. ప్రజల్లో ఉండే అభిప్రాయాన్నే తాను ఈ లేఖ ద్వారా తెలియజేస్తోన్నానని చెప్పారు. తనకు మొడటి నుంచీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం అలవాటని, అందుకే సూటిగా విమర్శలు చేస్తోన్నానని చెప్పుకొచ్చారు. అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ల మొహం మీదే కుండబద్దలు కొట్టటం తన నైజం.. సారీ అని అన్నారు.












Click it and Unblock the Notifications