కాపులకు పుట్టినవాడు ఎవడైనా ఈ పని చేస్తాడా?- ముద్రగడపై హరిరామ షాకింగ్ కామెంట్స్
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ను విమరిస్తూ కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాసిన బహిరంగ లేఖ.. కలకలం రేపుతోంది. ఇందులో ఆయన ప్రస్తావించిన అంశాలపై తాజాగా కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య స్పందించారు. ముద్రగడపై ఘాటు విమర్శలు చేశారు. కాపు ద్రోహిగా అభివర్ణించారు. ఈ మేరకు నాలుగు పేజీల బహిరంగ లేఖ రాశారు.
ఇప్పటివరకు తాను ముద్రగడనను చాలా పెద్ద మనిషి అని అనుకున్నానని, వివాదరహితుడిగా భావించానని చేగొండి పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ రాసిన లేఖతో ఆయనపై తనకు ఉన్న సదభిప్రాయాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ అవినీతి చక్రవర్తి అని, ఆయన వద్ద కాపు సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టాలని చూస్తోన్న వారిలో ముదగ్రడ కూడా కలిసిపోయారని ఆరోపించారు.

పవన్ కల్యాణ్ నీతిమంతుడని, బడుగు- బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తోన్నాడని హరిరామ అన్నారు. జనసేన పేరుతో సొంత రాజకీయ పార్టీని పెట్టి, సొంతంగా డబ్బులను ఖర్చు పెట్టుకుంటూ కాపులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీల సహకారంతో పోరాటం చేస్తోన్న పవన్ కల్యాణ్పై ముద్రగడ అభాండాలు వేయడం సరికాదని అన్నారు. దీని వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందని ఆరోపించారు.
కాపు కులస్తులకు పుట్టినవాడు ఎవడైనా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతాడా? ముద్రగడను నిలదీశారు. వైఎస్ఆర్సీపీ తరఫున కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేలా వైఎస్ జగన్ను ఒప్పించగలరా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. వైఎస్ జగన్కు బినామీగా వ్యవహరిస్తోన్నాడని, అక్రమ వ్యాపారాలు, స్మగ్లింగ్, రౌడీయిజం, బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నాడని ఆరోపించారు.
ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడానికి పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ తరఫున 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపాల్సిన అవసరం లేదని, కింగ్ మేకర్ అవడానికి అవసరమైనన్ని సీట్లను పొందగలిగినా సరిపోతుందని చేగొండి పేర్కొన్నారు. ఆ ఇంగితజ్ఞానం కొంతైనా లేకపోతే ముద్రగడ ఎలా రాజకీయాలు చేస్తోన్నారంటూ ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గం ప్రత్తిపాడులో ఇండిపెండెంట్గా లేదా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిస్తే చాలని సెటైర్ వేశారు.
వైసీపీలో చేరి అభాసుపాలుకావొద్దని చేగొండి సూచించారు. తెలుగుదేశంతో గానీ, బీజేపీతో గానీ పొత్తు లేదని పవన్ కల్యాణ్ ఏనాడూ ప్రకటించలేదని, పొత్తులు ఉన్నా తానే ముఖ్యమంత్రినని చెప్పుకోవడం సంతోషకరమని అన్నారు. పవన్పై చేస్తోన్న అభియోగాలన్నీ రాజకీయ లబ్ది కోసం ముద్రగడ ఇలా దిగజారడం సరికాదని చెప్పారు. నోరు మూసుకుని కూర్చుంటే అందరూ సంతోషిస్తారంటూ ముగించారు.












Click it and Unblock the Notifications