పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సీట్లలో పిఠాపురం మొదటి స్ధానంలో ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి ఇక్కడి నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అయితే ఇక్కడ పవన్ పోటీని ఊహించిన వైసీపీ కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని తమ పార్టీలో చేర్చుకుని వంగా గీతను గెలిపిచే బాధ్యతను అప్పగించింది. అయితే పిఠాపురంలో చరిత్ర చూస్తే ముద్రగడకు పీడకలగానే ఉంది.
ప్రస్తుతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు పోటీగా వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. అయితే ఇదే వంగా గీతను అసెంబ్లీకి తొలిసారి పంపిన నియోజకవర్గం పిఠాపురమే. అలాగే పార్టీ ప్రజారాజ్యం. దీంతో వంగా గీతను చట్టసభలకు తామే పంపామంటూ ఈ మధ్యే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం, అంతకు ముందే తాను రాజ్యసభ ఎంపీనని ఆమె కౌంటర్ ఇవ్వడం జరిగిపోయాయి. అయితే వంగా గీతను తొలిసారి అసెంబ్లీకి పంపిన పిఠాపురం ప్రజలు ఇప్పుడు ఆమె గెలుపు కోసం కృషి చేస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని మాత్రం అప్పట్లో మూడో స్ధానానికి పరిమితం చేశారు.

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగా గీత బరిలోకి దిగారు. అప్పట్లో టీడీపీలో రాజ్యసభ ఎంపీగా పనిచేసిన ఆమె చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరి పిఠాపురంలో పోటీ చేశారు. ఆమెకు ప్రత్యర్ధులుగా టీడీపీ నుంచి వర్మ, కాంగ్రెస్ నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం లక్షన్నర ఓట్లు పోలైతే.. ఇందులో వంగా గీతకు 46 వేలు, వర్మకు 45 వేలు, ముద్రగడకు 43 వేల ఓట్లు వచ్చాయి. దీంతో వంగా గీత కేవలం వెయ్యి ఓట్ల తేడాతో వర్మపై గెలిచారు.
ముద్రగడ మూడో స్ధానానికి పరిమితం అయ్యారు. అప్పట్లో వైఎస్ చరిష్మా కూడా ముద్రగడకు పనికిరాలేదు.
సీన్ కట్ చేస్తే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం తిరిగి వంగా గీతను గెలిపించేందుకు సిద్దమయ్యారు. అయితే పార్టీలే వేరు. అప్పట్లో వంగా గీత పవన్ అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం నుంచి గెలిస్తే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ముద్రగడ ఓడారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీ వైసీపీలో ఉన్నారు. రాజకీయాల్లో తన కంటే జూనియర్ అయిన వంగా గీతను గెలిపించే పనిలో ముద్రగడ ఉన్నారు. అంతే కాదు అప్పట్లో 2009లో తనకు చేసినట్లు మళ్లీ చేయొద్దని, ఈసారి ఎలాగైనా గీతను గెలిపించాలని ముద్రగడ తనకు పరిచయం ఉన్న వాళ్లందరికీ ఫోన్ చేసి వేడుకుంటున్నారు. పవన్ గెలిస్తే తన రాజకీయం ముగిసిపోవడం ఖాయమనే భయం ముద్రగడలో కనిపిస్తుందని స్ధానికంగా చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications