రాథాపై రెక్కీలో మరో ట్విస్ట్-ఇంటిలిజెన్స్ వైఫల్యం-అంతా వాడేసుకున్నారు -కాపుసేన కామెంట్స్
ఏపీలో టీడీపీ నేత వంగవీటి రాధా హత్యకు రెక్కీ నిర్వహించారన్న అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటికే ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తుండగా.. తాజాగా కాపు సంక్షేమ సేన కూడా స్పందించింది. రాధా హత్య రెక్కీ ఆరోపణల నేపథ్యంలో కాపుసేన సంచలన వ్యాఖ్యలు చేసింది.
రాధా రెక్కీ వ్యాఖ్యలపై కాపు సంక్షేమ సేన ఇవాళ విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించింది. కాపు సంక్షేమ సేన రాష్ట్ర కార్యదర్శి పెన్నూరి శ్రీకాంత్ ఈ రాధా రెక్కీ వ్యవహారంపై స్పందించారు. వంగవీటి రాధా నిస్వార్ధమైన మనిషిని ఆయన తెలిపారు. రాధా హత్యకు కుట్ర చేసారాన్న వ్యాఖ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రెక్కీ, హత్య చేద్దామని అనుకున్న వారు ఆ ఆలోచనలు విరమించుకుంటే మంచిదన్నారు. రాధాకు ప్రజలే అండగా ఉంటారని శ్రీకాంత్ వెల్లడించారు.
మరోవైపు వంగవీటి రాధాని అన్ని రాజకీయ పార్టీలు వాడుకున్నాయని కాపు సంక్షేమ సేన రాష్ట్ర కార్యదర్శి పెన్నూరి శ్రీకాంత్ తెలిపారు. పోలీసులు విచారణ జరిపి రెక్కీ చేసిన వారిని గుర్తించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో పోలీసులపై తమకు నమ్మకం ఉందన్నారు. రాధాకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. రాదాపై రెక్కీ వ్యవహారం పూర్తిగా ఇంటలిజెన్స్ వైఫల్యమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వంపై శ్రీకాంత్ వ్యాఖ్యలు ఎక్కుపెట్టినట్లయింది. అయితే రాధా ఇప్పటివరకూ ఈ కోణంలో విమర్శలు చేయకపోయినా కాపు సంఘాలు మాత్రం ఈ అంశాన్ని హైలెట్ చేస్తుండటం విశేషం.
రాధా హత్యకు రెక్కీ వ్యవహారంలో విజయవాడ పోలీసులు వైసీపీ ప్లోర్ లీడర్ అరవ సత్యాన్ని అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు వచ్చినా ఆయన కుమారుడు వాటిని ఖండించారు. అనారోగ్యంతో అరవ సత్యం ఆస్పత్రిలో చేరినా.. రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతోంది. వీటిపై రాధా కూడా మరోసారి స్పందించలేదు. తనకు ప్రభుత్వం ఇచ్చిన 2 ప్లస్ 2 గన్ మెన్లను మాత్రం తిప్పిపంపారు.