జగన్కు ‘కాపు’ సెగ: యాత్రను అడ్డుకున్న యువత, ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలు
అమరావతి: కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణం గురించి ఆడిగిన విద్యార్థుల మీద రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా పోలీసు బలగాన్ని ప్రయోగించిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జగన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సీఎం చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు.
ప్రజల గుండె మీద చేస్తున్న గాయం
విద్యార్థుల ఒంటి మీద పడిన ప్రతి ఒక్క దెబ్బా రాష్ట్ర ప్రజల గుండెల మీద మీరు చేస్తున్న గాయమేనని దుయ్యబట్టారు. విద్యార్థి నాయకుడు నాయక్ పరిస్థితి తనకు ఆందోళన కలిగిస్తోందని, ఆయనకు వెంటనే ప్రభుత్వం మంచి వైద్యం అందజేయాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లు కేంద్ర మంత్రివర్గంలో ఉన్న మీరు.. మీ కేసుల కోసం, లంచాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలి వేయడం వల్లే ఈ రోజు విద్యార్థులు, విపక్షాలు రోడ్డుకెక్కాల్సి వస్తోందని చంద్రబాబుపై మండిపడ్డారు.
లాఠీలు, తుపాకీలతో సమాధానమా?
‘గతంలో.. విద్యుత్ చార్జీలు తగ్గించండన్నందుకు బషీర్బాగ్లో ప్రజల గుండెల మీద కాల్పించారు. ఇప్పుడు గ్రామగ్రామానా, ప్రతి జిల్లాలో మీరు, మీ పార్టనర్లూ చేసిన వందల వంచనల మీద ప్రజలు గర్జిస్తున్నారు. చేతలతో సమాధానమివ్వలేని మీరు వారందరికీ లాఠీలతో, తుపాకులతో సమాధానం ఇస్తారా? బాబు గారు ఇది దుర్మార్గం' అని జగన్ నిలదీశారు.
జగన్కు కాపు సెగ
ఇది ఇలా ఉండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్రకు తూర్పు గోదావరి జిల్లాలో నిరసనల సెగ తగిలింది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇచ్చే విషయంలో జగన్ వైఖరిని నిరసిస్తూ పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో కాపు యువకులు శనివారం జగన్ పాదయాత్రను అడ్డుకున్నారు. ప్లకార్డులు, నల్లజెండాలు ప్రదర్శిస్తూ ‘జై కాపు.. జైజై కాపు' అంటూ నినాదాలు చేశారు.
తోపులాట.. స్పందించని జగన్..
కాపు రిజర్వేషన్ పై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని యువకులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై స్పందించకుండానే జగన్ అక్కడ్నుంచి ముందుకు కదిలారు.