మెత్తబడ్డ కరణం: 'ఆపరేషన్ ఆకర్ష్' పై చంద్రబాబు ఏం చెప్పారు?
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' అటు వైసీపీ అధినేత వైయస్ జగన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే, కొందరు టీడీపీ నేతలకు కూడా ఇలానే అవుతోందట. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినా తాము ఓటమి పాలవడం ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
పార్టీనే నమ్ముకుని, ఓటమి పాలైన నేతలకు ఆర్ధిక సాయం చేసేందుకు గాను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే రంగంలోకి దిగి గెలిచి వైసీపీ ఎమ్మెల్యేలకు కాకుండా ఓడిన టీడీపీ నేతలకు నియోజకవర్గాల అభివృద్ధి కోసం అంటూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రెండు కోట్లు కేటాయించారు.
అయితే ఈ సంతోషాన్ని ఎక్కువ కాలం నిలవనీయలేదు. వెంటనే 'ఆపరేషన్ ఆకర్ష్' అంటూ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకుంటున్నారు. ఇదే కొంతమంది టీడీపీ నేతలకు నచ్చడం లేదు. ఎందుకంటే అప్పటిదాకా రాజకీయ శత్రువులుగా ఉన్న వారితో కలిసి పనిచేయడమెలాగా? అన్న ఆందోళన కొందరు టీడీపీ నేతలను కలచి వేస్తోంది.
ఇలాంటి పరిస్థితి తొలుత కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేరికపై ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రామసుబ్బారెడ్డికు ఎదురైంది. దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు రామసుబ్బారెడ్డిని నేరుగా విజయవాడకు పిలిపించుకుని సర్దిచెప్పడంతో ఆయన మెత్తబడ్డారు.
అనంతరం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేరికను కాదనలేకపోయారు. తాజాగా ఇప్పుడు ఇదే పరిస్థితి ప్రకాశం జిల్లా సీనియర్ నేత కరణం బలరాంకు ఎదురైంది. ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఈరోజు టీడీపీలో చేరుతున్నారు.
గొట్టిపాటి చేరికను టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం, ఆయన కుమారుడు అద్దంకి నియోజకవర్గ ఇంఛార్జి కరణం వెంకటేశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిజానికి వైసీపీ ఎమ్మెల్యేల చేరిక సమయంలో టీడీపీ ఇంఛార్జులతో చంద్రబాబు మాట్లాడి వారిని బుజ్జగించిన సందర్భాలు ఉన్నాయి.
అయితే, కరణం బలరాం విషయంలో చంద్రబాబు దానిని పాటించలేదా? అనే చర్చ సాగింది. ఈ క్రమంలో నిన్న చంద్రబాబు మునుపటి వ్యూహాన్నే అనుసరిస్తూ కరణం బలరాంను విజయవాడకు పిలిపించారు. కుమారుడితో పాటు తన అనుచరగణాన్ని వెంటబెట్టుకుని విజయవాడకు వచ్చిన బలరాంతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు.
గొట్టిపాటి టీడీపీలోకి చేరిన మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తానని వారితో చెప్పారు. అంతేకాదు జడ్పీఛైర్మన్ పదవిని కూడా కరణం వర్గానికే కేటాయిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి గల కారణాలను కూడా కూలంకుషంగా వారికి చంద్రబాబు వివరించారు.
''ప్రభుత్వాన్నే కూల్చేస్తామంటూ విపక్షం బరి తెగిస్తే.. చూస్తూ ఊరుకోవాలా? విపక్షం ఆ స్థాయికి వెళ్లినప్పుడు చూస్తూ ఊరుకోలేం కదా. అందుకే 'ఆకర్ష్'కు తెర తీశాం. సీనియర్లుగా పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సర్దుకుపోవాల్సిందే'' అని చంద్రబాబు గట్టిగా చెప్పడంతో కరణం బలరాం మెత్తబడ్డారని తెలుస్తోంది.