ఆన్లైన్ మోసం: హైదరాబాద్లో కర్ణాటక సైబర్ గ్యాంగ్
హైదరాబాద్: రోజుకు నాలుగ వడ్డీ చెల్లిస్తామంటూ ప్రజలను మోసం చేసిన ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా నాలుగైదు కోట్ల రూపాయలు ప్రజల నుంచి పిండుకున్నారు. దీనికి వారు చేసింది, కేవలం ఆన్లైన్లో ప్రకటనల వర్షం కురిపించడమే. ఈ విధంగా ప్రజలకు టోకరా వేసిన గ్యాంగ్ను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక రాష్ట్రం మైసూరు కేంద్రంగా ఈ మోసం సాగినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలను అదనపు ఉపకమిషనర్ బి.శ్రీనివాసరెడ్డి సోమవారం వెల్లడించారు.
ఫణిరాజ్ గౌడ అనే వ్యక్తి మైసూర్ కేంద్రంగా నడుస్తున్న నిష్కా కో-ఆపరేటివ్ సొసైటీకి చైర్మన్. కొన్నిరోజుల పాటు సజావుగా సాగిన ఈ సంస్థ తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. భారీ స్థాయిలో నిధులు దుర్వినియోగం కావడంతో మైసూరుతో పాటు కర్ణాటకలోని చరంరాజ్నగర్ పోలీసులు అతడిపై పలు కేసులు నమోదు చేశారు. పోగొట్టున్న డబ్బును రాబట్టుకోవడానికి ఫణిరాజ్గౌడ తన సంస్థల మాజీ డైరెక్టర్ అయిన పుత్తరాజు, సన్నిహడైన మహేష్ చిక్కయ్య, సొసైటీ మాజీ ఉద్యోగి ఆర్ఎం చమన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాదాపీర్తో కలిసి ప్రజల నుంచి డిపాజిట్లు ఎలా సేకరించాలన్న దానిపై వ్యూహం రూపొందించాడు.
పుత్తరాజు, ఆర్ఎం చమన్ పేరుపై వీకాన్ ట్రేడర్స్ పేరుతో కొత్త సంస్థను రిజిస్టర్ చేయించాడు. దీని కార్యకలాపాలు నిర్వహించడానికి గోవాలోని పంజిం నగరంలో ధనవంతులు అధికంగా ఉండే ప్రాంతంలో ఓ కార్యాలయాన్ని అద్దెకు తీసుకుని ఒక వెబ్సైట్ను తయారు చేశారు. ‘ఒకసారి డిపాజిట్ చేయండి. రోజుకు నాలుగుశాతం వడ్డీని పొందండి' అన్న నినాదంతో వివిధ మార్కెటింగ్ వెబ్సైట్లలో ఈ ప్రకటనను పోస్ట్ చేశారు. లావాదేవీలన్నీ ఆన్లైన్ బ్యాంక్ ఖాతాల ద్వారా జరుగుతాయని పేర్కొన్నారు.
ఈ వెబ్సైట్ను పరిశీలించిన ఆసక్తిపరులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తొలుతగా కొంతడబ్బును వారు ఇచ్చిన ఖాతాల్లో డిపాజిట్ చేశారు. ఇలా డిపాజిట్ చేసిన వారికి కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా నాలుగుశాతం వడ్డీ చెల్లించారు. నమ్మకం కుదరడంతో తర్వాత భారీగా డిపాజిట్లు చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా హైదరాబాద్, సైబరాబాద్లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఎంతోమంది ప్రజలు డబ్బులు ఖాతాల్లో జమ చేశారు. వీరంతా 4 నుంచి 5 కోట్ల రూపాయలు సేకరించిన తర్వాత సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి పత్తా లేకుండా పోయారు. ఈ డబ్బుతో వారంతా ఖరీదైన ఆస్తులను కూడబెట్టుకున్నారు. దీనిపై కొందరు బాధితులు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఆశ్రయించారు.
కర్ణాటక వెళ్లిన సైబర్ క్రైం పోలీసులు చిత్రదుర్గలో దాదాపీర్, చమన్ను అరెస్టు చేసి 26 లక్షల 50 వేల రూపాయలు వసూలు చేశారు. దాదాపీర్ నుంచి 9 లక్షల రూపాయల నగదు, 58 లక్షల రూపాయల విలువ చేసే ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. వీరి అరెస్టు విషయం తెలుసుకున్న సూత్రధారి ఫణిరాజ్గౌడ, పుత్తరాజు, మహేష్ ఇన్నోవా కారులో హసన్ జిల్లాలోని సక్లేష్పూర్ పారిపోయారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు 3 లక్షల 95 వేల రూపాయల నగదు పలు దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు.