కార్తీకమాసంలో ఆలయాల సందర్శనకు ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజీ టూర్- వివరాలు ఇవే
APSRTC: పవిత్ర కార్తీక మాసం ఆరంభమైన నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రఖ్యాత శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జాము నుంచే పలు ఆలయాల్లో భక్తులు బారులు తీరి నిల్చున్నారు. భక్తి ప్రపత్తులతో దీపాలను వెలిగించి పూజలు చేస్తోన్నారు.
ఏకాదశి, సోమ, శనివారాల్లో ఉపవాసాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తోంది. తెల్లవారు జామున, సాయంత్ర వేళల్లో ఆలయాల్లో దీపాలను వెలిగిస్తుంటారు భక్తులు. తులసికి ప్రత్యేక పూజలు చేస్తారు. గోవులను పూజిస్తారు. ఈ మాసంలో పరమశివుడికి ఆవు పాలతో అభిషేకించి, జాజిపూలతో పూజించితే శివస్థానాన్ని పొందుతారని ప్రశస్తి.

పవిత్ర కార్తీక మాసంలో నదుల్లో పుణ్యస్నానాలను ఆచరించడం, దైవదర్శనం చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. రోజుకొకటి చొప్పున కార్తీక పురాణంలో ఉండే 30 అధ్యాయాలను పారాయణం చేయడం శుభప్రదంగా భావిస్తారు. శైవక్షేత్రాల్లో కార్తీక పురాణాన్ని పారాయనం చేస్తారు.
కార్తీక మాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుపతి జిల్లాల్లో గల ప్రఖ్యాత ఆలయాలను కలుపుతూ ఈ ప్యాకేజీ టూర్ను రూపొందించారు. వీటి కోసం అల్ట్రా డీలక్స్ బస్సులను వినియోగించనుంది.
తిరుపతి నుంచి బయలుదేరే అల్ట్రా డీలక్స్ ప్యాకేజీ టూర్ బస్సు- శ్రీనివాస మంగాపురం, తొండవాడ, అప్పలాయగుంట, నారాయణవనం, కైలాసనాథ కోన, నాగలాపరం, సురూటుపల్లి పుణ్యక్షేత్రాలను దర్శించుకుని మళ్లీ తిరుపతికి చేరుకోవడంతో ఆ యాత్రా టూర్ స్పెషల్ ముగుస్తుంది.
— APSRTC (@apsrtc) November 1, 2024
కార్తీకమాసం తొలి సోమవారం అంటే ఈ నెల 4వ తేదీన ఈ ప్రత్యేక ప్యాకేజీ టూర్కు శ్రీకారం చుట్టనుంది. తొలి బస్సు తెల్లవారు జామున 6 గంటలకు తిరుపతిలోని ఏడుకొండల బస్టాండ్ నుంచి బయలుదేరి వెళ్లనుంది. పెద్దలకు 400, పిల్లలకు 280 రూపాయలను ఛార్జీగా వసూలు చేస్తారు.
కార్తీకమాసం ముగిసే వరకు ప్రతి సోమవారం కూడా ఈ అల్ట్రా డీలక్స్ ప్రత్యేక ప్యాకేజీ టూర్ బస్సు అందుబాటులో ఉంటుందని, దీన్ని వినియోగించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. భక్తుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఇతర రోజుల్లోనూ ఈ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications