హైదరాబాద్: అశోక్బాబుపై కవిత ఫైర్, జగన్పై దేవినేని
హైదరాబాద్: అక్రమంగా ఉద్యోగం పొందిన ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం మండిపడ్డారు. తెలంగాణ ప్రజలే హైదరాబాదు నుండి వెళ్లిపోవాలన్న అశోక్ బాబు వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ ప్రజలు హైదరాబాదు విడిచి వెళ్లాలన్న అశోక్ వెంటనే తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎపిఎన్జీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల సహనాన్ని సీమాంధ్ర నాయకులు, ఉద్యోగులు పరీక్షించవద్దని కోరారు.
రెచ్చగొట్టొద్దు: నాయిని
అశోక్ బాబు రెచ్చగొట్టే మాటలు మాట్లాడవద్దని తెరాస నేత నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. తమకు హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ కావాలన్నారు. హైదరాబాదుకు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉందన్నారు. కష్టపడి మా తాత ముత్తాతలు దీనిని నిర్మించారని, తమను దీని నుండి విడదీస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు. హైదరాబాదు లేని రాజధానిని ఊహించుకోలేమన్నారు. హైదరాబాదు మీద ఆశలు పెట్టుకొని సీమాంధ్రులు అడియాసల పాలు కావొద్దని హితవు పలికారు.
త్వరలో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాదును అడిగే హక్కు ఎవరికి లేదన్నారు. హైదరాబాదు విషయంలో తేడా వస్తే ప్రజలు ఊరుకోరన్నారు. గొంతెమ్మ కోరికలను పక్కన పెట్టి సీమాంధ్రులు రాజధాని కోసం ఆలోచించుకోవాలన్నారు. అశోక్ బాబు కాదని ఆయన అశోక్ రుబాబు అని శ్రవణ్ మండిపడ్డారు. ఆయన దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగం సంపాదించారని ఆరోపించారు.
జగన్కు బెయిల్ ఒప్పందంలో భాగమే: దేవినేని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడం కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య ఒప్పందంలో భాగంగానే జరిగిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు కృష్ణా జిల్లాలో ఆరోపించారు.
సిబిఐ జెడిని బదలీ చేసిన కాంగ్రెసు.. జగన్ మార్గం సుగమం చేసిందన్నారు. జిల్లాలో ఈ నెల 25 నుంచి నవంబర్ 6 వరకు తెలుగుదేశం పార్టీ ప్రజా చైతన్య యాత్రలు చేపట్టనున్నట్లు చెప్పారు.