మళ్లీ కావూరి యూ టర్న్!: ఆ ఇద్దరి లేఖలపై వెంకయ్య
న్యూఢిల్లీ: కేంద్ర జౌళీశాఖ మంత్రి కావూరి సాంబశివ రావు మరోసారి యూ టర్న్ తీసుకున్నారు! ఆయన అధిష్టానం ఒత్తిడికి తలొగ్గారు. తాను సమైక్యం కోసం కట్టుబడి ఉన్నానని చెబుతూనే, రాష్ట్రం విడిపోతే ఏం చేస్తారో చెప్పాలని కేంద్రాన్ని, పార్టీ అధిష్టానాన్ని ఆయన బుధవారం ప్రశ్నించారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేదే తన కోరిక అని కావూరి బుధవారం అన్నారు. అందుకోసం చివరి వరకు పోరాడుతానని చెప్పారు. కేబినెట్లో తెలంగాణ నోట్ను తాను తీవ్రంగా వ్యతిరేకించానన్నరు. విభజిస్తే సీమాంధ్రకు ఏం చేస్తారో చెప్పాలని, సీమాంధ్ర ప్రజల హక్కుల కోసం తాను పోరాడుతానన్నారు. కాగా, సమైక్యం కోసం కట్టుబడి ఉన్నానంటూనే కావూరి విడిపోతే ఏం చేస్తారో చెప్పాలని చెప్పడం ద్వారా అధిష్టానానికి తలొగ్గినట్లుగా కనిపిస్తోందంటున్నారు.
కాంగ్రెసుపై వెంకయ్య నాయుడు ఫైర్
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు కాంగ్రెసు పార్టీ పైన మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతోందని, సమస్యలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి తనయుడు ఎప్పుడో రాసిన లేఖలు ఇప్పుడు బయటపెట్టడమేమిటని ప్రశ్నించారు.
దిగ్విజయ్ సింగ్ టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలు విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదట సొంత పార్టీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రుల సమైక్యవాదం గురించి మాట్లాడాలని వెంకయ్య ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత ముఖ్యమో సీమాంధ్ర ప్రజల సమస్యలు పరిష్కరించడం అంతే ముఖ్యమన్నారు.