చూడని పార్టీలా: కాంగ్రెసు, టిడిపిలపై కెసిఆర్ ధ్వజం
హైదరాబాద్: తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను నమ్మి ఓటేస్తే పంటికి అందకుండా మింగేస్తారని, ముఖ్యమంత్రి పదవి కోసం కోట్టుకుంటారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు విరుచుకుపడ్డారు ఆదివారం తెలంగాణ భవన్లో మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి తెలుగుదేశం శాసనసభ్యుడు జైపాల్యాదవ్, టిజివో అధ్యక్షుడు, తెలంగాణ జేఏసీ కో-చైర్మన్ వి.శ్రీనివాస్గౌడ్, తెలంగాణ ధూం ధాం వ్యవస్థాపక అధ్యక్షుడు రసమయి బాలకిషన్, వివిధ పార్టీలకు చెందిన పలువురిని కెసిఆర్ పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
మహబూబ్నగర్ జిల్లాలో నెట్టెంపాడు, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని, అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలు ఏం వెలగబెట్టాయని, వాళ్లే తెలంగాణ తెచ్చారా అనిస గడిచిన పదేళ్లుగా కడుపులో చల్ల కదలకుండా ఉన్నవాళ్లు ఉద్యమకారులా అని ఆయన తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులపై ధ్వజమెత్తారు.
రోడ్ల మీదికి వచ్చి తన్నులు తిన్న వాళ్లం మనం పనికిమాలిన వాళ్లం అయ్యామా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్లో తెరాసను కలిపితే మొదటికే మోసం వస్తుందని ఆ పని చేయలేదని ఆయన సమర్థించుకున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఆనందాన్ని తెరాస కోరుకుంటుంటే, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని, మేకవన్నె పులులుగా వస్తున్న వాటి చేతుల్లో మోసపోతే గోసపడ్తామని ఆయన అన్నారు.
హైదరాబాద్లో లిక్కర్ అమ్మకాలకు వీలుగా చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాలు కల్లు దుకాణాలను మూసివేయించాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క కలంపోటుతో ఈ దుకాణాలను తెరిపిస్తానని ప్రకటించారు. పాలమూరు జిల్లాలో 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు.
తాను నిరాహార దీక్షకు వెళ్లినప్పుడు ఉద్యోగం పోయినా సరే అంటూ పెన్డౌన్ చేయడం దగ్గరి నుంచి సకల జనుల సమ్మె వరకు శ్రీనివాస్గౌడ్ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి తెలంగాణ కోసం పోరాడారని, ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఎన్ని రకాలుగా వేధించినా సింహంలా కొట్లాడారని ఆయన అన్నారు. శ్రీనివాస గౌడ్ ఎన్నికల్లో నిలబడాలనేది ప్రజల డిమాండ్ అని, అందుకే తానే రాజకీయాల్లోకి దించానని అన్నారు.
రసమయి బాలకిషన్ తెలంగాణ కళలకు ఒక గౌరవం తెచ్చారని, ఉద్యమాన్ని తన ఆటపాటలతో ఉర్రూతలూగించారని చెప్పారు. ఆయనను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తానే ఆహ్వానించినట్లు తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారని ప్రకటించారు.