కేసీఆర్ అలాంటి సీఎం కాదు: హరీష్, వెహికిల్స్ ఇచ్చిన చంద్రబాబు
హైదరాబాద్/విజయవాడ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాలుగు గోడల మధ్య ఉండే సీఎం కాదని మంత్రి హరీష్ రావు సోమవారం అన్నారు. వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఇప్పటికే ప్రజల మధ్య గడిపిన కేసీఆర్ మంగళవారం గజ్వేల్, బుధవారం కరీంనగర్ జిల్లా ప్రజల మధ్య గడుపుతారని చెప్పారు.
పేదల అభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ ముందుకు పోతున్నారన్నారు. హైదరాబాదులో ఏకలవ్య భవన్ నిర్మాణం విషయం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో ఎరుకల సంఘం నాయకులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రులు అంటే ఇప్పటి వరకు సచివాలయంలోనే ఉండేవారని, కేసీఆర్ ఆ పద్ధతిని పూర్తిగా మార్చేశారన్నారు. కేసీఆర్ బస్తీల్లో తిరుగుతున్నారని, వారి బతుకులు మార్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణలో బలహీన వర్గాలకు మంచి అవకాశాలున్నాయన్నారు.

పోలీసులకు వాహనాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు విజయవాడలో పోలీసులకు కొత్త వాహనాలు పంపిణీ చేశారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్త అవసరాల కోసం రూ.106 కోట్ల వ్యయంతో 2,434 వాహనాలు కొనుగులో చేసింది.
విజయవాడలో 136 వాహనాలను ముఖ్యమంత్రి పోలీసులకు అందించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ తరఫున హుధుద్ తుపాను బాధితులకు విరాళం అందజేశారు. ఏపీ పోలీసులు హుధుద్ తుఫాన్ బాధితులకు రూ.8 కోట్ల సహాయాన్ని అందించారు. డీజీపీ రాముడు సీఎం చంద్రబాబుకు చెక్ను అందించారు.
దావోస్కు చంద్రబాబు
చంద్రబాబు సోమవారం అర్థరాత్రి దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. రేపు సాయంత్రానికి చంద్రబాబు బృందం దావోస్ చేరుకోనుంది. దావోస్లో నాలుగు రోజుల పాటు చంద్రబాబు పర్యటన ఉంటుంది. ఈనెల 21, 22 తేదీల్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు పాల్గొని, ప్రసంగిస్తారు.
ఈ నెల 23న మధ్యాహ్నం దావోస్ నుంచి బయలుదేరి 24న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. చంద్రబాబుతో పాటు ఢిల్లీ ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభపాటి రామ్మోహన్ రావు, అధికారులు టక్కర్, వెంకయ్య చౌదరి, అజయ్ జైన్, రావత్ వెళ్లనున్నారు.
యుద్ధ ప్రాతిపదికన టాయిలెట్లు నిర్మిస్తాం: వెంకయ్య
దేశవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని, భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నిర్మాణాలకు బిల్గేట్స్ ఫౌండేషన్ ఆర్ధిక సాయం అందిస్తుందన్నారు.
అదేవిధంగా దేశంలోని కార్పోరేట్ సంస్థలు కూడా తమ ఆదాయంలో రెండు శాతాన్ని టాయిలెట్ల నిర్మాణాలకు ఖర్చు చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయా కంపెనీలకు సూచించారని చెప్పారు. ఈ నిర్మాణాల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ప్రత్యేక బడ్జెట్ కల్పిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications