మోడీ, పవన్కళ్యాణ్ ఎఫెక్ట్: కెసిఆర్లో వణుకు..అందుకే!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ భయం పట్టుకుందా? ఆయన ఆత్మరక్షణలో పడ్డారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. కెసిఆర్ హఠాత్తుగా తన టార్గెట్ను అనూహ్యంగా మార్చి వేశారని, మోడీ కారణంగానే ఆయన తన ప్రధాన టార్గెట్ మార్చారని అంటున్నారు.
కెసిఆర్ నిన్నటి వరకు కాంగ్రెసు పార్టీని దనుమాడారు. తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేతల పైన నిప్పులు చెరిగారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వంటి వాళ్లను కూడా వదలలేదు. బిజెపిని అడపాదడపా విమర్శించారు.

అయితే, రెండు రోజుల క్రితం నరేంద్ర మోడీ తెలంగాణలో సుడిగాలి పర్యటన చేశారు. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాదు సభల్లో పాల్గొన్నారు. నిజామాబాద్, హైదరాబాద్ సభల్లో పవన్ కళ్యాణ్, మహబూబ్ నగర్, హైదరాబాద్ సభల్లో చంద్రబాబులు పాల్గొన్నారు.
మోడీ సభలకు అనూహ్య స్పందన వచ్చిందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. బిజెపి సభలకు అనూహ్య స్పందన రావడం, దానికి పవన్ కళ్యాణ్ మద్దతు లభించడం, టిడిపి-బిజెపి పొత్తు నేపథ్యంలో కెసిఆర్లో వణుకు పుట్టిందని బిజెపి ఎద్దేవా చేస్తోంది. మోడీ సభలను చూసి కెసిఆర్ బెదిరిపోయారని ఆ పార్టీ అంటోంది. అయితే, మోడీ ప్రభావంతో బిజెపి సీట్లు గెలుచుకోకపోయినా.. ఓట్లలో కోత పెడుతుందనే భయం కెసిఆర్లో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మోడీ సభలు హిట్ అయిన నేపథ్యంలో... తాజాగా కెసిఆర్ తన వ్యూహం మార్చి మోడీని టార్గెట్ చేశారంటున్నారు. నిజామాబాద్ సభలో రెండు రోజుల క్రితం మోడీ, పవన్ పాల్గొన్నారు. సభ విజయవంతం కావడంతో స్థానిక నేతలు జోరు మీద ఉన్నారు. ఈ వేడిని తగ్గించేందుకు కెసిఆర్ ఆఘమేఘాల మీద నిజామాబాద్ పర్యటన ఖరారు చేశారని కథనాలు వస్తున్నాయి. మోడీ పర్యటన, పవన్ మద్దతు కారణంగా బిజెపి క్యాడర్లో రెండు రోజులుగా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications