కుట్రల ఉంటాయనే: రాజకీయాల్లో కొనసాగడంపై కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొందామనే అనుకున్నానని, కానీ సీమాంధ్ర శక్తుల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన అవసరముందని గుర్తించే బాధ్యతలు స్వీకరించానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.
మెట్రో రైలు మార్గంలో చేపట్టాల్సిన మార్పులు, ఆఅవసరంపై శనివారం ఆయన ఎల్అండ్టీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిపై తన ఆకాంక్షల గురించి భావోద్వేగంతో మాట్లాడారు. ఆ వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణ వచ్చిన తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నానని కానీ, ఆంధ్ర శక్తులు ఈ రాష్ట్రాన్ని బతకనీయవని అర్థమైందని, నీళ్లు, ఉద్యోగాలు, కరెంటు విషయంలో పేచీలు పెడతారని గ్రహించానని, హైదరాబాద్పైనా రాద్ధాంతం చేస్తారని అనుకున్నానని, వారి కుట్రలను, ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన అవసరాన్ని గుర్తించానని, తెలంగాణ సాధించడమే కాదని, దానిని నిలబెట్టుకోవాలని కూడా నిర్ణయించుకున్నానని తెలిపారు.
తెలంగాణను దేశంలోనే నంబర్వన్ రాష్ట్రంగా, హైదరాబాద్ను అద్భుతంగా తీర్చిదిద్దేందుకే నేను బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చిందని తెలిపారు. హైదరాబాద్ విషయంలో రాజీ పడి ఉంటే పదేళ్లముందే తెలంగాణ వచ్చేదని తెలిపారు. తల తెగిపడినా హైదరాబాద్ను వదులుకునేది లేదని చెప్పామని అందుకే ఇప్పుడు హైదరాబాద్తో కూడిన తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి ఎంతో చరిత్ర, ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు.
అది చెరిగిపోకుండా అభివృద్ధి చేయాలన్నదే తన తపన అని తెలిపారు. తెలంగాణ కోసం వందలాదిమంది యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారని, తాను కూడా చావు నోట్లో తలపెట్టానని ఆయన తెలిపారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చేయాలని ఆంధ్రాశక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన మరుసటి రోజునుంచే కుట్రలు ప్రారంభించారని అన్నారు.
మెట్రో రైలు ఆగిపోతుందని వార్తలు సృష్టించారని, ఇందుకు ఎల్అండ్టీ రాసిన లేఖలనే వాడుకున్నారని, ఇది మమ్మల్ని బాధించిందన్నారు. ప్రజలనూ గందరగోళానికి గురి చేసిందన్నారు. మెట్రో రైలుకు మేం ఎంతో సహకరిస్తున్నామని, అయినప్పటికీ (ఎల్అండ్టీ) లేఖలు రాయడం ఆంధ్రా మీడియా చేస్తున్న విష ప్రచారానికి ఉపయోగపడిందన్నారు.