చిరంజీవి ఫోజు, జగన్ పార్టీ పాక్: ద్రోహంపై కెసిఆర్ ప్రశ్న
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం, కేంద్రమంత్రి చిరంజీవి తెలంగాణపై మాట ఇచ్చి వెనక్కి తీసుకోవడం ద్రోహం కాదా అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ద్రోహం చేసిన వాళ్లనే తాను ద్రోహులని చెప్పానని, సీమాంధ్ర ప్రజలకు తాము వ్యతిరేకం కాదన్నారు.
తెలంగాణ విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి ఆ తర్వాత అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తామని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ తర్వాత హైదరాబాదును పాకిస్తాన్తో పోల్చిందని, అదే హైదరాబాదులో ఇప్పుడు వైయస్ జగన్ సభ పెడతానంటున్నారని ఇదేం వైఖరి అని కెసిఆర్ ప్రశ్నించారు.

తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నారని, 2009 ఎన్నికల సమయంలో సామాజిక తెలంగాణ అంటూ చిరంజీవి ఫోజులు కొట్టారని, ఇప్పుడు వెనక్కి వెళ్లారని నిప్పులు చెరిగారు. ఇలాంటి వారిని ద్రోహులు అనకుండా ఏమనాలని ప్రశ్నించారు. సీమాంధ్రలోని అట్టడుగు వర్గాలు, బహుజనులు విభజనను స్వాగతిస్తున్నారని చెప్పారు. సీమాంధ్ర ప్రజలకు తాము వ్యతిరేకం కాదన్నారు.
ద్రోహం చేసిన వాళ్లందర్నీ మాత్రం ద్రోహులే అంటామన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల హైదరాబాదును పాకిస్తాన్తో పోల్చినప్పుడు, కాంగ్రెసు ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి తెలంగాణ ప్రజలను రాక్షసులు అన్నప్పుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులను తాలిబన్లతో పోల్చినప్పుడు, సమైక్య ఉద్యమంలో హత్యలే తప్ప ఆత్మహత్యలుండవని మరో నేత అన్నప్పుడు మాట్లాడని వారు తన పైన విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు.
కడుపు మండినోడు ద్రోహం చేసిన వాళ్లను ద్రోహులే అంటాడన్నారు. సీమాంధ్ర ఉద్యమంలో తనను, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని సంస్కారహీనంగా చూపిస్తున్నారని, ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని అది తప్పనిపించని వాళ్లకు తనది తప్పని ఎలా అనిపిస్తోందన్నారు. తనను తప్పుపట్టిన సిపిఐ నారాయణ, బిజెపి బండారు దత్తాత్రేయలది వన్ సైడ్ లవ్వని విమర్శలు గుప్పించారు.
సీమాంధ్రలోని ఆందోళనలో ఎక్కడైనా సంస్కారం కనిపిస్తుందా అని ప్రశ్నించారు. డిసెంబర్ 9న ప్రకటనను తానే అడ్డుకున్నానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ జబ్బలు చర్చుకుంటుంటే తాము చేతులు ముడుచుకొని కూర్చోవాలా అన్నారు. ఆంధ్రాలో జరిగేది ఓ ఉద్యమమా అని ధ్వజమెత్తారు. తనకు తెలంగాణ రావడం ఇష్టం లేదనే వారికి బుద్ధుందా అన్నారు.












Click it and Unblock the Notifications