సోనియాతో భేటీకి ఢిల్లీలోనే కెసిఆర్: విలీనమా, పొత్తా?
న్యూఢిల్లీ: వివిధ రాజకీయ పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు, ప్రజా సంఘాల నేతలు హైదరాబాదుకు తిరుగుముఖం పట్టిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జట్టు మాత్రం ఢిల్లీలోనే ఉండిపోయింది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి కెసిఆర్ నిరీక్షిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, కాంగ్రెసులో పార్టీని విలీనం చేయాలా, కాంగ్రెసుతో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలా అనే అంశంపై కెసిఆర్ ముమ్మరంగా చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో సోనియా గాంధీ తెరాసతో సంబంధాలపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. నిజానికి, కెసిఆర్ శనివారం ఉదయం సోనియా గాంధీని కలుస్తారని ప్రచారం సాగింది. అయితే, సోనియాతో కెసిఆర్ భేటీ జరగలేదని తెరాస నాయకుడు జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. సీమాంధ్ర చానెళ్లు తప్పుడు ప్రచారం సాగిస్తున్నాయని ఆయన విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన ప్రతి పార్టీ ప్రెసిడెంట్ను కూడా కలిసి కెసిఆర్ కృతజ్ఞతలు చెబుతారని ఆయన అన్నారు. రాజకీయపరమైన చర్చలకు ఇది సమయం కాదని ఆయన అన్నారు. సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలపడానికే తాము ఢిల్లీలో ఉన్నామని, ఇంకా అపాయింట్మెంట్ కోరలేదని ఆయన చెప్పారు. సోనియాతో అపాయింట్మెంట్ ఉందని ప్రజల్లో అపోహలు కలిగించడానికి మీడియా ప్రయత్నాలు చేసిందని ాయన అన్నారు.
పొత్తులు, విలీనంపై ఇప్పుడే మాట్లాడలేమని ఆయన అన్నారు. పార్టీలో అంతర్గతంగా చర్చ జరగాల్సి ఉందని, ఎన్నికల సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని జగదీశ్వర్ రెడ్డి చెప్పారు.
అయితే, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాఁధీని ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ శనివారంనాడు కలిసి అరగంట పాటు చర్చలు జరిపారు. తెరాసతో చేయాల్సిన చర్చల గురించే వారి మధ్య చర్చలు జరిగాయని అంటున్నారు.