డిప్లొమాటిక్ వీసా కోసం కేసీఆర్ దరఖాస్తు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి వెళ్లారు. డిప్లొమాటిక్ వీసా కోసం దరఖాస్తు చేయడానికి ఆయన కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లారు. కేసీఆర్ త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
కాగా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను హైదరాబాదుకు ఆహ్వానించే అంశంపై కాన్సులేట్ అధికారులతో మాట్లాడారని సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఒబామా భారత్ వస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాదులో కూడా పర్యటించాలంటూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఒబామాను ఆహ్వానిస్తూ కాన్సులేట్కు లేఖ రాశారు.
పారిశ్రామికరంగానికి ఉపయోగపడేలా సిలబస్: కేటీఆర్
తరగతి పాఠ్యాంశాల్లో మార్పు చేర్పులపై చట్టం తీసుకొచ్చే యోచనలో ఉన్నామని, పారిశ్రామిక రంగానికి ఉపయోగపడేలా సిలబస్లో మార్పులు చేర్పులు తీసుకొస్తామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. వృత్తి విద్యకు సంబంధించిన సిలబస్ మార్పుపై గురువారం సచివాలయంలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిలు సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

మా పరీక్షలు మేమే నిర్వహించుకుంటాం: జగదీశ్వర్ రెడ్డి
మా పరీక్షలు మేమే నిర్వహించకుంటామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. ఏపీ ప్రభుత్వం కోరితే తెలంగాణ బోర్డు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి తెలంగాణ బోర్డు ఏర్పడుతుందని చెప్పారు. తెలంగాణ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు ఉంటాయన్నారు. ఉమ్మడి పరీక్షల కోసం ఏపీ ప్రభుత్వం స్పందన కోసం వేచి చూశామన్నారు.
సమైక్య రాష్ట్రంలో నిధులు సరిగ్గా రాలేదు: హరీష్ రావు
సమైక్య రాష్ట్రంలో చెరువులకు రావాల్సిన నిధులు సక్రమంగా రాలేదని ఇప్పుడు చెరువులను పునరుద్ధరించుకోవాలని మంత్రి హరీష్ రావు అన్నారు.
మహబూబ్ నగర్లో మిషన్ కాకతీయ సమీక్షలో ఆయన మాట్లాడారు. గత పాలకుల వల్ల చెరువులు విధ్వంసానికి గురయ్యాయని చెప్పారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చెరువుల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. జిల్లాలో ఇంతకుముందు కనీసం ఎస్ఈ కార్యాలయం కూడా లేదని, గతంలో నాలుగు జిల్లాలకు ఒక ఎస్ఈని నియమించారన్నారు.












Click it and Unblock the Notifications