కెసిఆర్ ప్రభుత్వం వేట: ఎఫ్డిసి భూములు వెనక్కి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వం భూముల వేటలలో పడింది. తాజగా హైదరాబాదులోని ఫిలంనగర్లో చలన చిత్రాభివృద్ధి (ఎఫ్డిసి)కి కేటాయించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మొత్తం 16.48 ఎకరాల స్థలాన్ని వెనక్కి తీసుకుంది. భూమి కేటాయించి మూడున్నర దశాబ్దాలు గడిచినా స్థలాన్ని వాడుకోకపోవడంతో ప్రభుత్వం ఆ చర్యకు దిగింది.
ఆ స్థలాన్ని వెనక్కితీసుకుంటూ శుక్రవారం సీసీఎల్ఏ సిన్హా ఉత్తర్వులిచ్చారు. మరో నాలుగు ఎకరాల్లో ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. ఆ వెంటనే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎంకే మీనా ఆదేశాలతో క్షేత్రస్థాయి సిబ్బంది రంగంలోకి దిగారు. ‘ఈ స్థలం ప్రభుత్వానిది' అంటూ బోర్డులు పెట్టారు. ఒకప్పడు మద్రాసులో ఉన్న తెలుగు చలనచిత్ర పరిశ్రమను హైదరాబాద్కు రప్పించడానికి, అప్పటి ప్రభుత్వం భూములు ఇచ్చింది, పలు ప్రోత్సహకాలు కూడా ఇచ్చింది.

అందులో భాగంగా 1982లో జీవో నెం.1015 ద్వారా షేక్పేట మండలం సర్వేనెం.403లో ఫిలింనగర్లో 50 ఎకరాల స్థలాన్ని ఎఫ్డీసీకి అప్పగించారు. ఎకరానికి రూ.8500లు మాత్రమే వసూలు చేశారు. ఇందులో పద్మాలయ స్టూడియోస్కు 9.5 ఎకరాలు, సురేష్ ప్రొడక్షన్స్కు 5 ఎకరాలు, ఆనంద్ సినీ సర్వీసెస్కు మరో 5 ఎకరాలు కేటాయించారు. పదెకరాలను హౌసింగ్ బోర్డుకు కూడా కేటాయించారు. ఆ రకంగా మరో 20 ఎకరాల భూమి ఖాళీగా ఉంది.
‘మీకు కేటాయించిన భూమిని రక్షించుకుంటారా? లేక మేం స్వాధీనం చేసుకోవాలా?' అంటూ 2013 జూన్లో హైదరాబాద్ జిల్లా యంత్రాంగం నోటీసులు ఇచ్చింది. అయినా ఎఫ్డీసీ అధికారులు పట్టించుకోలేదు. ఏడాది కిందట ల్యాండ్ ఆడిట్ చేయడంతో ఎఫ్డీసీ నిర్లక్ష్యం బయటపడింది. దాంతో ఎఫ్డీసీకి కేటాయింపులు రద్దుచేసి, భూమిని వెనక్కితీసుకోవడానికి అనుమతించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎంకే మీనా గత నెల 21, 27 తేదీల్లో సీసీఎల్ఏకు లేఖ రాశారు.
ఈ లేఖపై బుధవారం ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎల్ఎంఏ) సమావేశంలో చర్చించారు. భూమిని వెనక్కితీసుకోవాలని సిఫార్సు చేశారు. మూడెకరాలు వాణిజ్య పన్నుల శాఖకు ఎఫ్డీసీ నుంచి వెనక్కితీసుకున్న 16 ఎకరాల భూమిలో మూడెకరాలను వాణిజ్య పన్నుల శాఖ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు.
ప్రభుత్వ భూములను గుర్తించండి: మహమూద్ అలీ
తెలంగాణలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ, అసైన్డ్, భూదాన భూములను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. శుక్రవారం రెవెన్యూశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల నవీకరణ చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ పనితీరును భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ఎస్కే సిన్హా వివరించారు.
భూ కేటాయింపు విధానం, రెవెన్యూ అకాడమి, అటవీ హక్కులు, పట్టాదార్పాస్ పుస్తకాలు, సర్వే, డీమార్కేషన్, జమాబందీ వంటి అంశాలపై మంత్రికి సమగ్ర నివేదిక అందించారు. ఈ సమావేశంలో రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, సీసీఎల్ఏ కమిషనర్ జీడీ అరుణ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ కమిషనరేట్ అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications