'దేశంలో నెంబర్ 1 సీఎం కేసీఆర్', కేటీఆర్పై తెనేటీగల దాడి
హైదరాబాద్/ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని ఆ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి బుధవారం ఖమ్మం జిల్లాలో అన్నారు. ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ.. పై వ్యాఖ్యలు చేశారు.
అకాల వర్షాలకు కుదేలైన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీశ్ రెడ్డి చెప్పారు. బుధవారం వారు వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను మంత్రులు పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కేటీఆర్, ఈటెలపై తేనెటీగల దాడి
తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారక రామారావుల పైన తేనెటీగలు దాడి చేశాయి. కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల మండలం నర్సింగాపూర్లో వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల పరిశీలనకు బుధవారం నాడు మంత్రులు కేటీఆర్, ఈటెల, ఎమ్మెల్యేలు పుట్టా మధు, గంగుల కమలాకర్, విద్యాసాగర్ రావు వచ్చారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న మామిడితోటను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వారు అక్కడి నుంచి పరుగులు తీశారు.
ప్రపంచ బ్యాంక్ అధికారులతో తెలంగాణ సీఎస్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ప్రపంచ బ్యాంక్ అధికారులు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని ప్రాధాన్యతలు, కార్యక్రమాలను ఆయన వివరించారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి, సవాళ్లను తెలిపారు. బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కాగా, ప్రపంచ బ్యాంకు కొన్ని ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి ఆసక్తి కనబర్చింది.