మూడు నెలల్లో కెమెరా నిఘాలో నగరం: కెసిఆర్
హైదరాబాద్: సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆకాంక్షించారు. పోలీసు శాఖకు కొత్తగా ఏర్పాటు చేసిన 100 ఇన్నోవాలను, 200 ద్విచక్ర వాహనాలను ఆయన గురువారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
ప్రజల భద్రత కోసమే పోలీసులకు అధునాతన వాహనాలను సమకూర్చినట్లు ఆయన తెలిపారు. నగరంలో ప్రతి చోటా ఏం జరుగుతుందో తెలిసే విధంగా నిఘాను పెంచుతామని ఆయన అన్నారు. సిసి కెమెరాల నిఘా ఏర్పాటుతో నేరాల సంఖ్య తగ్గిస్తామని చెప్పారు. పిఎస్ల పరిధితో సంబంధం లేకుండా పోలీసులు సేవలు అందించాలని ఆయన సూచించారు.
పేకాట క్లబ్బుల వల్ల అనేక కుటుంబాలు కూలిపోతున్నాయని, నగరంలో పేకాట క్లబ్బులు లేకుండా చేస్తామని కెసిఆర్ అన్నారు. రన్నింగ్ బస్సు ఎక్కే పద్ధతి పోవాలని ఆయన అన్నారు. ఇందుకు రవాణా శాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముంబై రవాణా వ్యవస్థను అధ్యయన చేసి మన దగ్గర కూడా అటువంటి విధానాన్నే అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే క్రమంలో ఫ్రెండ్లీ పోలీసింగుకు పోలీసులు ఏ విధంగానైతే సహకరిస్తామని అంటున్నారో అదే విధంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన అన్నారు. ఏం జరిగినా పోలీసులకు సమాచారం అందించే సంస్కృతి పెరగాలని సూచించారు.
లండన్ నగరంలో సిసి కెమెరాల వల్ల 85 శాతం నేరాలు తగ్గాయని ఆయన చెప్పారు. ఇదే పద్ధతిని లండన్ వ్యవస్థను అధ్యయనం చేసి ప్రవేశపెడుతామని చెప్పారు. సిసి కెమెరాల ఏర్పాటుకు రిలయన్స్ ప్రతినిధులు తమ వంతు సహకారం అందజేస్తామని చెప్పారని కెసిఆర్ గుర్తు చేసారు. మూడు నెలల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. 24 గంటల పాటు నగరం సిసి కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని చెప్పారు.