ఆదాయంపై కెసిఆర్, పన్నులు ఉండవని యనమల
హైదరాబాద్: సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేయనుండటంతో అందుకు అవసరమైన ఆదాయ వనరులను సమీకరించే పనిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పడింది. గురువారం వాణిజ్య పన్నుల శాఖపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమీక్షించారు. ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెరగడానికి మార్గాలు అన్వేషించాలని, ఆయన నిర్దేశించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గకుండా చూడాలని, దీని కోసం పటిష్ఠమైన నిఘాను ఏర్పాటు చేయాలన్నారు.
స్వామిగౌడ్ పిటిషన్ కొట్టివేత
టిఎన్జీవో హౌసింగ్ సొసైటీ అక్రమాలకు సంబంధించి తమపై దాఖలైన పిటిషన్ను రద్దు చేయాలని ఎమ్మెల్సీ స్వామి గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ను హైదరాబాద్ హైకోర్టు కొట్టివేసింది. స్వామి గౌడ్ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎ రాజశేఖర్రెడ్డి ఆ పిటిషన్ను డిస్మిస్ చేశారు. అక్రమాల ఆరోపణలపై వేసిన కమిటీ 120 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉండగా 180 రోజుల్లో సమర్పించిందని, కనుక ఆ పిటిషన్ను రద్దు చేయాలని కోరుతూ స్వామిగౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం స్వామి గౌడ్ పిటిషన్ను కొట్టివేసింది.
పన్నులు వేయం: యనమల
లోటు బడ్జెట్ ఉందని, అయినప్పటికీ తాము పన్నులు వేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అన్నారు. యనమల అసెంబ్లీ ఆవరణలో తనను కలిసిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బడ్జెట్ లోటును అధిగమించేందుకు ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉందన్నారు. అన్ని విధాలా ఖర్చులు తగ్గించుకోనున్నట్లు ఆయన తెలిపారు.
ఇంకా అప్పులు తెచ్చుకునేందుకు ఎఫ్ఆర్బిఎం కోసం చట్ట సవరణ చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. రుణ మాఫీ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామన్నారు. ఎర్రచందనం విక్రయానికి అనేక రకాల అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు.