కోపంతో వెళ్లిపోయిన కేసీఆర్: తాను పిలిస్తే వచ్చారని మంత్రులతో బాబు
అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాల పరిష్కారంపై గత వారంలో రాజధాని ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో జరిగిన ఓ ఆసక్తికర ఘటనను చంద్రబాబు తమ మంత్రులతో పంచుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాటను గౌరవించారని చెప్పారు. ఈ సమావేశంలో పాలమూరు - రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాల ప్రస్తావన వచ్చిన సమయంలో వాటికి అనుమతులు లేవని చంద్రబాబు స్పష్టం చేశారంట.
కేంద్ర జలవనరులశాఖ అధికారులు కూడా ఇదే అంశాన్ని ధృవీకరించారని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తెలంగాణ అధికారులు తమ వద్ద కొన్ని జీవోలు ఉన్నాయని చెప్పడంతో, కేంద్ర అధికారులు కల్పించుకుని తమ నుంచి ఎలాంటి అనుమతులూ పొందలేదు కాబట్టి ఆ జీవోలన్నీ చెల్లవని స్పష్టం చేశారట. దీంతో చిర్రెత్తుకొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారట.
దీంతో వెంటనే అప్రమత్తమైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జోక్యంచేసుకుని "సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. వచ్చి కూర్చోండి" అని సర్దిచెబితే, తన మాటకు గౌరవం ఇస్తూ, ఆయన తిరిగి వచ్చారని మంత్రులకు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.
కేంద్రంలోని కొందరు అధికారులు, మంత్రులు కూడా తన సీనియారిటీని గౌరవించారనీ, చెప్పిన పనిని కూడా వెంటనే చేస్తున్నారని చంద్రబాబు తన మంత్రివర్గంలోని సహచరులకు చెప్పారని తెలుస్తోంది.